చిన్నారిని వదిలేసి..
కంచిలి : గొల్లకంచిలి–2 అంగన్వాడీ కేంద్రం లోపల ఓ చిన్నారిని వదిలేసి తలుపులు వేసిన ఘటన గ్రామస్తుల ఆగ్రహానికి కారణమైంది. మంగళవారం సాయంత్రం కేంద్రం తలుపులు వేసేటప్పుడు ఓ చిన్నారి లోపల ఉండగా చూడకుండా తాళం వేశారు. వివరాల్లోకి వెళ్తే... గొల్లకంచిలి ప్రాథమిక పాఠశాల మేడపైన ఉన్న తరగతి గదిలో గ్రామంలో 1, 2 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. రెండు కేంద్రాల్లో ఆరుగురు సిబ్బంది పని చేస్తున్నారు. మంగళవారం రోజూలాగే సాయంత్రం రెండో కేంద్రం తలుపులు వేయగా లోపల చిన్నారి సంతోష్ను వదిలేసి న్యూట్రిస్ట్ చంద్రావతి తాళం వేసి వెళ్లిపోయారు.
సంతోష్ తల్లి నీలవేణి తమ కుమారుడు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో పరిసరాలన్నీ వెతికి అనుమానమెుచ్చి కేంద్రానికి సాయంత్రం నాలుగు గంటలకు వెళ్లి చూసింది. తీరా తాళం వేసి ఉన్న గది నుంచి చిన్నారి ఏడుపు విన్పించగా కిటికీలోంచి చూసేసరికి సంతోష్ లోపలే ఉన్నాడు. దీంతో నీలవేణి గ్రామస్తులు, కుటుంబ సభ్యులకు కేకలు వేసి పిలిచి తాళాన్ని పగులగొట్టి చిన్నారిని బయటకు తెచ్చారు. అనంతరం గ్రామస్తులు కేంద్రం నిర్వహిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్త కరుణకుమారి నెలవారీ సమావేశానికి వెళ్లడం, ఆయా సావిత్రి గ్రామంలో ఎవరో మృతి చెందడంతో అక్కడికి వెళ్లడంతో న్యూట్రిస్ట్ చంద్రావతికి బాధ్యతను అప్పగించారు. ఈ సంఘటనపై కార్యకర్త, ఆయా, న్యూట్రిస్ట్ అందరినీ గ్రామస్తులు నిలదీశారు. విషయం తెలుసుకున్న ఏసీడీపీవో సీహెచ్ ఝాన్సీ సాయంత్రం కేంద్రానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని, తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు.