వాగులో పడి చిన్నారులు మృతి


రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా వై రామవరం మండల కేంద్రంలో బుధవారం ప్రమాదవశాత్తూ ఇద్దరు చిన్నారులు వాగు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. మండల కేంద్రానికి చెందిన వంతాల సత్తిబాబు, సీతమ్మ దంపతులకు నానిబాబు(4), మేఘన(2)అనే పిల్లలున్నారు. దంపతులు బుధవారం ఉదయం పని నిమిత్తం బయటకు వెళ్లారు. దాంతో ఇద్దరు పిల్లలు సత్తి బాబు తల్లి నీలమ్మ వద్దకు వెళ్లారు. దుస్తులు ఉతికేందుకు నీలమ్మ సమీపంలోని కొండవాగు వద్దకు వెళ్తూ ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్లింది.


ఆమె దుస్తులు ఉతికే పనిలో నిమగ్నమై ఉండగా... చిన్నారులిద్దరూ ఆడుకుంటూ నీటిలో పడి మునిగిపోయారు. నీలమ్మ కొద్దిసేపటి తర్వాత చూసే సరికే పిల్లలిద్దరు కనిపించకపోవడంతో కంగారు పడి పరిసర ప్రాంతాలలో గాలించింది. కానీ ప్రయోజనం లేకపోయే సరికి వాగులో వెతికింది.  ఆ క్రమంలో నీటిలో పడి ఉన్న చిన్నారుల మృతదేహలను గుర్తించి కేకలు వేసింది. దాంతో స్థానికులు వచ్చి వాగులో పడి ఉన్న మృతదేహలను వెలికి తీశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top