సర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు


నిధుల దుర్వినియోగం..

ఐదుగురు పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు

డీపీవో చంద్రశేఖర్‌




హాజీపూర్‌(మంచిర్యాల) : జిల్లాలోని తాండూరు మండలం కిష్టంపేట గ్రామ పంచాయతీలో అభివృద్ధి నిధుల విషయంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించి ఆ గ్రామ సర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు చేసినట్లు జిల్లా పంచాయితీ అధికారి చంద్రశేఖర్‌ మంగళవారం ‘సాక్షి’కి ఫోన్‌లో తెలిపారు.  కిష్టంపేటలో నిధుల అక్రమాలపై సర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు చేయడంతో పాటు ఇందుకు బాధ్యులైన మరో ఐదుగురు పంచాయతీ కార్యదర్శులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి పనుల్లో భాగంగా రూ. 15 లక్షల మేరకు అక్రమాలు జరిగినట్లు విచారణలో తేలిందని అన్నారు.



వీటితో పాటు పంచాయతీ పరిధిలోని సాధారణ, ఇంటి పన్నుల వసూళ్లు, ఇతర నిధులకు సంబంధించి రూ.1,23,573లను ఖర్చు చేసి సరైన లెక్కలు చూపలేకపోయారని పేర్కొన్నారు. ఈ అక్రమాలపై గతేడాది సెప్టెంబర్‌లో సర్పంచ్‌కు నోటీసులు జారీ చేసినట్లు గుర్తు చేశారు. ఈ ఘటనపై డివిజినల్‌ పంచాయతీ అధికారి పూర్తి స్థాయి విచారణ చేసినందున అక్రమాలు వెలుగు చూసినట్లు పేర్కొన్నారు. దీంతో గ్రామ సర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు చేసినట్లు తెలిపారు. అప్పటి నుంచి కిష్టంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వర్తించి గ్రామంలో జరిగిన పలు అక్రమాలకు బాధ్యులైన ఐదుగురు జీపీ కార్యదర్శులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు డీపీవో తెలిపారు.  

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top