పేరంటానికి పిలిచి నగలు చోరీ

పేరంటానికి పిలిచి నగలు చోరీ - Sakshi

పిన్ని.. అక్కా.. అంటూ వరుస కలిపింది. వచ్చిన 5 రోజులకే తన వాక్చాతుర్యంతో చుట్టుపక్కల మహిళలను బుట్టలో వేసుకుంది. వంటిపై నగలు ఎక్కువగా ఉన్న మహిళను లక్ష్యంగా ఎంచుకుంది. పేరంటం ఉందంటూ ఇంటికి ఆహ్వానించింది. మత్తు మందు కలిపిన జ్యూస్‌ను ఆప్యాయంగా చేతికందించింది. అలా మత్తులోకి జారుకోగానే వంటిపై నగలన్నీ తీసుకుని క్షణాల్లో మాయమైపోయింది. వివరాల్లోకి వెళ్తే.. 

 

భీమవరం :  పేరంటానికి అంటూ జ్యూస్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి బంగారు వస్తువులతో ఉడాయించిన మాయలేడి ఉదంతమిది. స్థానికులు, బాధితురాలు సూర్యకుమారి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమవరం పట్టణం గునుపూడి ప్రాంతంలో ఎం.సూర్యకుమారి నివసిస్తోంది. అదే ప్రాంతంలో ఐదు రోజుల క్రితం సంగీత అనే పేరుగల ఒక మహిళ అద్దెకు దిగింది. తన భర్త మెడికల్‌ రిప్రజెంటీవ్‌గా పని చేస్తారని పరిసర ప్రాంతాలవారికి చెప్పింది. అతి కొద్ది సామాన్లతో నివాసముంటున్న సంగీత చుట్టు పక్కల మహిళలను తన వాక్చాతుర్యంతో ఆకట్టుకుంది. ఈ క్రమంలో శుక్రవారం తన నివాసానికి దగ్గరలో గల ఎం.సూర్యకుమారితో తన ఇంటిలో పూజలు చేసుకుంటున్నానని పేరంటానికి రావాలంటూ ఆహ్వానించింది. పేరంటానికి చుట్టు పక్కల అందరినీ పిలిచి ఉంటుందని భావించిన సూర్యకుమారి సంగీత ఇంటికి వెళ్లింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో నిర్ఘాంతపోయింది. ఇంతలో సంగీత జ్యూస్‌ తీసుకువచ్చి ఇవ్వడంతో ఎండ తీవ్రతకు జ్యూస్‌ను తాగింది.  వెంటనే మత్తులోకి జారుకుని స్పృహ తప్పి పడిపోవడంతో అదే అదనుగా సంగీత సూర్యకుమారి వద్ద గల 20 కాసుల బంగారు ఆభరణాలతో ఉడాయించింది. ఎంత సేపటికి సూర్యకుమారి ఇంటికి వెళ్లకపోవడంతో ఆమె కుటుంబ సభ్యలు సంగీత ఇంటికి వెళ్లి చూశారు. సూర్యకుమారి పడిపోయి ఉండడంతో మాయా లేడి బంగారంతో ఉడాయించినట్టు గుర్తించారు. సూర్యకుమారికి సపర్యలు చేశారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top