హోదాకు సమాన ప్యాకేజీ ఇస్తామన్నారు
►అందుకే ఒప్పుకున్నాను
►విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
►జల్లికట్టుకు, ప్రత్యేక హోదాకు ముడిపెడుతున్న ఒకాయన సర్పంచుగా కూడా గెలవలేదు
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పినందుకే దానికి ఒప్పుకున్నానని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. సోమవారం సచివాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కేంద్రంతో సఖ్యతగా ఉండాలని, అప్పుడే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఆనాడు తీరని అన్యాయం చేసిన వాళ్లు విచిత్రంగా ఇవాళ తనకు లేఖలు రాస్తున్నారు అంటూ విమర్శించారు. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు పోలిక ఏమిటో అర్థం కావడం లేదన్నారు. జల్లికట్టుకు, ప్రత్యేక హోదాకు ముడిపెడుతూ మాట్లాడుతున్న ఒకాయన సర్పంచుగా కూడా గెలవలేదన్నారు. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం కొందరికి పనిగా మారిందని, రైలు కాల్చినా భయంలేదని అన్నారు. మంజనాథ కమిషన్ రిపోర్టు రాకుండానే ఎవరి పాటికి వారు గొడవలు చేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. జీఎస్డీపీ లెక్కలు కేంద్ర ప్రభుత్వం తయారు చేసేవనీ, వాటిని దొంగలెక్కలంటే ఏం చేస్తామన్నారు. విశాఖలో కాగడా పెట్టి తిరుగుతామంటే ఏమిటి అర్థమని ప్రశ్నించారు. ఇవాళ విశాఖ విశ్వనగరంగా ఉందన్నారు.
నన్ను క్షమించండి : వంశధార ప్రాజెక్ట్ భూసేకరణ విషయంలో సమస్య తలెత్తిం దని, తాను చెప్పిన పాలసీకి నిర్వాసితులు అంగీకరించారని చెప్పారు. జూన్ 2, 2016న ఇచ్చిన జీవోను అమలు చేయడంలో జిల్లా అధికారులు విఫలమయ్యారని తెలిపారు. రూ.450 కోట్లు పరిహారం ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదన్నారు. దీనికి అక్కడి రైతులకు క్షమాపణ చెబుతున్నానని అన్నారు.
దావోస్లో ప్రపంచాన్ని ఆకర్షించాం
శ్రీలంకలో మనవాళ్లు పరిశ్రమలు స్థాపించడానికి, అక్కడి వారు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం జరిగినట్లు తెలిపారు.