క్యాష్‌ లేట్‌ సేవలు

క్యాష్‌ లేట్‌ సేవలు - Sakshi


నగదు రహిత లావాదేవీలకు సెల్‌ నంబర్ల చిక్కు

 జిల్లాలో 30 శాతం మందికి మొబైల్‌ ఫోన్లు లేవు

 ఇంటింటి సర్వేలో తేల్చిన అధికారులు

 క్యాష్‌లెస్‌ సేవలకు అంతరాయం




జనగామ : దేశంలో పేరుకుపోయిన నల్లధనాన్ని వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలు నగదు పాట్లు పడుతూనే ఉన్నారు. నిత్యావసర వస్తువుల నుంచి అత్యవసర సేవల కోసం చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నా తగినంత డబ్బు అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పల్లెల్లో నగదు రహిత సేవలను ప్రోత్సహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించడంతో జిల్లాలో వాటిని విజయవంతం చేసేందుకు అధికారులు కొన్ని రోజులుగా కృషి చేస్తున్నారు. అయితే కొత్త జిల్లాగా రూపాంతరం చెందిన జనగామలో క్యాష్‌లెస్‌ లావాదేవీల వైపు అడుగులు పడుతున్న తరుణంలో సెల్‌ నం బర్లు ప్రధాన అడ్డంకిగా మారాయి. నగదు లేకుండా కార్డుతో అందించే సేవల్లో కీలకపాత్ర పోషించే సెల్‌ నంబర్లు ప్రజలందరికీ లేకపోవడంతో అధికారులు సందిగ్దంలో పడ్డారు.



35,947 మందికి ఖాతాలు లేవు..

పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిం చేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు కలిసి ఇటీవల 13 మండలాల్లో ఇంటింటి సర్వే చేపట్టారు. నవంబర్‌ మొదటి వారంలో నిర్వహించిన సర్వేతో జిల్లాలో 1,54,519 కుటుం బాలు ఉండగా, 17,619 కుటుంబాలు డెబిట్‌ కార్డు, స్మార్ట్‌ ఫోన్‌తో లావాదేవీలు కొనసాగిస్తున్నారు. కాగా, 87,969 మందికి ఖాతాలు ఉండగా,  35,947 మందికి లేవు. ఇదిలా ఉండగా అకౌం ట్ల మంజూరు ప్రక్రియ వేగంగా జరుగుతున్నప్పటికి బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు కొన్ని గ్రామాలను క్యాష్‌లెస్‌ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.



పైలెట్‌గా ఆరు గ్రామాల ఎంపిక..

జిల్లాలో 28 గ్రామాలను క్యాష్‌లెస్‌ సేవల కింద ఎంపిక చేశారు. ఇందులో శామీర్‌పేట, కొడవటూర్, బండనాగారం, తమ్మడపె ల్లి, యశ్వంతాపూర్, నష్కల్‌ను పైలెట్‌ గ్రామాలుగా ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో క్యాష్‌లెస్‌ లావాదేవీలను ప్రారంభిం చేందుకు అధికా రులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు బ్యాంకు అకౌంట్లు, ఏటీఎం కార్డుల జారీ, స్వైపింగ్‌ మిషన్ల వినియోగంపై చైతన్యం చేస్తున్నారు.



ఆధార్, సెల్‌ నంబర్లు కీలకం..

క్యాష్‌లెస్‌ లావాదేవీల్లో ఆధార్‌ నంబర్, సెల్‌ నంబర్‌ కీలకంగా ఉంటాయి. స్వైపింగ్‌ మిషన్‌లో కార్డును స్వైప్‌ చేసినప్పుడు విని యోగదారుడి సెల్‌ నంబర్‌కు మెసెజ్‌ వస్తుంది. ఇందులో ఎంత వరకు ఖర్చు చేశామనేది మెసెజ్‌ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే అసలే సెల్‌ నంబర్‌ లేని వారికి క్యాష్‌లెస్‌ లావాదేవీలు అందకుండా పోతున్నాయి.



కుటుంబానికి మొత్తంగా ఒకే నంబర్‌..

జనగామ మండలం శామీర్‌పేటలో నగదు రహిత లావాదేవీ లను ప్రోత్సహించడంలో జిల్లాలో మొదటి స్థానంలో ఉంది. ఈ గ్రామంలో ఇప్పటివరకు 73 మందికి సెల్‌ నంబర్లు లేవు. కొన్ని గ్రామాల్లో ఇంట్లో ఒకటే నంబర్‌ ఉంది, ఇద్దరు కలిపి ఒకే నం బర్‌ను వినియోగిస్తున్నారు. బ్యాంకుల్లో ఒకటే నంబర్‌ను ఇద్దరు వినియోగించడం, ఖాతా,  ఏటీఎం జారీలో ఒకటే సెల్‌ నంబ ర్‌ను ఇవ్వడం కారణంగా స్వైప్‌ చేసిన సమయంలో మెసెజ్‌ రాదు. దీంతో వినియోగదారుల్లో కొంత ఆందోళన వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఈ కారణంగా ముందు సెల్‌ నంబర్లు తీసుకు నే విధంగా అధికారులు ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. అయితే అధికారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ నంబర్‌ తీసుకోవాలని సూచిస్తున్నప్పటికి ఆయా గ్రామాల్లో సిగ్నల్‌ ప్రాబ్లమ్‌ కారణంగా చాలామంది తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఇలా క్యాష్‌లెస్‌ లావాదేవీలకు సెల్‌ నంబర్లు లేకపోవడం అధికారుల ప్రయత్నానికి ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాగా, జిల్లాలో  30 శాతం మందికి సెల్‌ నంబర్లు లేవని తెలిసింది.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top