ప్రాథమిక విచారణలో కోడెల కుమార్తెపై కేసు
గుంటూరు రూరల్: శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె పి.విజయలక్ష్మితో పాటు మరో ఆరుగురిపై వేసిన ప్రైవేటు కేసు ప్రాథమిక విచారణలో ఉంది. కోడెల కుమార్తె, మరో ఆరుగురు రౌడీలు కలసి నల్లపాడు పాలిటెక్నిక్ కళాశాల రోడ్డులోని తన స్థలాన్ని కబ్జా చేశారని గత నెల 17న నల్లపాడు గ్రామానికి చెందిన కుందూరు శివలక్ష్మి స్పెషల్ మొబైల్ కోర్టులో ఫిర్యాదు చేశారు.
ఈ కేసును విచారించాలని నల్లపాడు పోలీసులకు స్పెషల్ మొబైల్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. అప్పటి నుంచి పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు. స్పెషల్ మొబైల్ కోర్టు ఆదేశం వచ్చిన వెంటనే విచారణ ప్రారంభించామని, విచారణ ప్రాథమిక దశలో ఉందని గుంటూరు సౌత్ డీఎస్పీ బి.శ్రీనివాస్ గురువారం రాత్రి చెప్పారు.