ప్రమాదవశాత్తు కారు దగ్ధం


నల్లమాడ (పుట్టపర్తి) : నల్లమాడ మండలం అరవవాండ్లపల్లి తండా వద్ద ఆదివారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. అందులోని ఇద్దరు ప్రయాణికులు ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు. ఎస్‌ఐ కె.గోపి కథనం మేరకు.. తాడిపత్రికి చెందిన నాగేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసులు కదిరి, నల్లమాడ, పుట్టపర్తి మీదుగా కర్ణాటక రాష్ట్రం పావగడకు వెళ్లేందుకు (ఏపీ05డీడబ్ల్యూ 4599) కారులో బయలుదేరారు. అరవవాండ్లపల్లి తండా వద్దకు రాగానే ఇంజిన్‌ వేడెక్కి కారు ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా స్టార్ట్‌ కాలేదు.



చాలా సేపటి నుంచి కారులో ఏసీ పనిచేస్తుండటంతో మంటలు రేగాయి. ఆర్పేందుకు చుట్టుపక్కల నీరు లే కపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారు కేకలు వేశారు. సమీపంలోని గొర్ల కాపరులు, తండా వాసులు సంఘటనా స్థలానికి చేరుకుని పుట్టపర్తి అగ్నిమాపక కేంద్రానికి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. అప్పటికే రేకులు మినహా కారులోని తక్కిన అన్ని భాగాలూ పూర్తిగా కాలిపోయాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top