ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలి
వరంగల్: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఉదంతం మరవక ముందే ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు. జిల్లాలోని కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో సాయినాథ్ అనే విద్యార్థి రైలు కింద పడి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. సాయినాథ్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణపురం.
కాగా మేడ్చల్ లోని సీఎమ్ఆర్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నసాయినాథ్ సీనియర్ల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నాడు. సాయినాధ్ పర్సులో సూసైడ్ నోట్ లభించినట్లు పోలీసులు తెలిపారు. తన ఆత్మహత్యకు కళాశాలలోని సీనియర్ల వేధింపులే కారణమని ఆ నోట్ లో పేర్కొన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
'ప్లీజ్ స్టాప్ ర్యాగింగ్... ఆరోజు సీనియర్లు అలా వేధించకపోతే నేను ఆత్మహత్య చేసుకునేవాడిని కాదు' అని సూసైడ్ నోట్ లో రాసినట్లు సమాచారం. కాగా సాయినాథ్ మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించిన పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.