ఇటుకల వ్యాపారి దారుణహత్య
మహబూబ్నగర్ క్రైం: ఇటుక బట్టీల యజమాని దారుణహత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా తలపై బండరాయితో మోది చంపేశారు. ఈ సంఘటన బుధవారం మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో కలకలం రేపింది. పూర్తి వివరాలిలా.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేసీతండాకు చెందిన జటావత్ జగన్(45) అనే వ్యక్తి ఇటుకల వ్యాపారం చేస్తుండేవాడు. పదేళ్ల కిందట ఈ ప్రాంతానికి పిల్లల మర్రి దగ్గర 60 గుంటల భూమి కొని ఇటుకల బట్టీలు నిర్వహించేవాడు. అతనివద్ద 14 మంది కూలీలు పనిచేస్తుంటే వారిలో 11మందిని ఇటీవలే తొలగించాడు.
చిన్నచిన్న అవసరాల కోసం ఒరిస్సాకు చెందిన బిరాబాగ్ అనే వ్యక్తిని మాత్రం పనిలో పెట్టుకున్నాడు. అయితే మంగళవారం ఉదయం జగన్ మహేశ్వరం వెళ్లి అక్కడ పనులు చూసుకొని రాత్రికి బట్టీల దగ్గరకు వచ్చాడు. బిరాన్ బాగ్, మరో వ్యక్తితో కలిసి జగన్ అర్ధరాత్రి వరకు మందు తాగాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఉదయం జగన్ రక్తపుమడుగులో విగతజీవుడై కనిపించాడు. రాత్రి మందు తాగిన ఇద్దరు పరారీలో ఉండటంతో వారిపై అనుమానాలు బలపడుతున్నాయి.
ఇటీవల బిరాపన్ బాగ్పై జగన్ చిన్న విషయానికి దాడిచేశాడు. ఆ విషయం మనసులో పెట్టుకుని తాగినమైకంలో హత్య చేశాడా.. లేక వెంట ఉన్న వ్యక్తి దాడిచేసి చంపాడా.. అనే విషయం ఇంకా తెలియరాలేదు. సంఘటన స్థలాన్ని రూరల్ ఎస్ఐ కాశి పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.