శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

మీడియాతో మాట్లాడుతున్న ఈవో సాంబశివరావు - Sakshi

 

టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడి

– ఈనెల 3న శ్రీవారికి సీఎం పట్టువస్రాల సమర్పణ

– ఉత్సవాల్లో రెండు ఘాట్‌రోడ్లలో వాహనాల అనుమతి

సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం చేశామని టీటీడీ ఈవో  సాంబశివరావు వెల్లడించారు.  శుక్రవారం ఇక్కడి అన్నమయ్య భవన్‌ అతిథి గృహంలో జేఈవో కేఎస్‌ శ్రీనివాసరాజు, సీవీఎస్‌వో ఘట్టమనేని శ్రీనివాస్‌తో కలసి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను మీడియాకు  వెల్లడించారు. అక్టోబరు 1 నుంచి 12వ తేదీ వరకు తిరుమల రెండు ఘాట్‌రోడ్లలో 24 గంటలూ వాహనాల రాకపోకలకు అనుమతిస్తామన్నారు.

భక్తుల దర్శనార్థం 7వ తేదీన గరుడ వాహన సేవను  రాత్రి 7.30 గంటలకే నిర్వహిస్తామన్నారు. వాహన మండపం నుండి హథీరాంజీ మఠం వరకు ఉండే సుమారు 25 వేల మంది భక్తులను గరుడ సేవను దర్శించుకున్న తర్వాత వారిని వెలుపలకు పంపి అదే స్థానంలో కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తుమన్నారు. వాహన సేవలో హారతి కూడళ్ల వద్ద  రెట్టింపు స్థాయిలో భక్తులను అనుమతించి ఉత్సవర్ల దర్శనం కల్పిస్తామన్నారు. గరుడ సేవలో శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాన్ని 24 గంటలూ తెరిచి ఉంచే ఏర్పాట్లు చేస్తామన్నారు. రోజుకు 2 వేల ఆర్టీసీ బస్సుట్రిప్పులు, గరుడసేవలో 3800 ట్రిప్పులు తిరిగే ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 9 నుండి అర్థరాత్రి 1 గంట వరకు అన్నప్రసాదాలు వడ్డించే  ఏర్పాట్లు చేస్తామన్నారు. భక్తుల ఫిర్యాదులు, సూచనల కోసం కామన్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో టోల్‌ఫ్రీ నెంబరు 1800425111111 అందుబాటు ఉంటుందన్నారు. నాణ్యత ప్రమాణాలు పరిశీలించాకే లడ్డూలు వితరణ చేస్తామన్నారు.

 శ్రీవారి భక్తుల వైద్యసేవల కోసం 12 ప్రథమ చికిత్సా కేంద్రాలు , 10 అంబులెన్స్‌లు ఏర్పాటు చేశామన్నారు. సాధారణరోజుల్లో  3500 మంది పోలీసులు, గరుడ సేవలో మొత్తంగా 4700 మందిని భద్రతకు వినియోగిస్తామన్నారు. ఈనెల 3వ తేది ధ్వజారోహణం  సందర్భంగా  సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని, అదే సందర్భంలో టీటీడీ డైరీ, క్యాలెండర్లు ఆవిష్కరిస్తారన్నారు. జేఈవో కేఎస్‌ శ్రీనివాసరాజు మాట్లాడుతూ, గడిచిన బ్రహ్మోత్సవాల అనుభవాన్ని దష్టిలో ఉంచుకుని మరింత ఉన్నతంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు. వాహన సేవలతోపాటు శ్రీవారి ఆలయంలో మూలవర్ల దర్శనంకోసం తరలివచ్చే భక్తులకోసం క్యూలైన్లు విస్తరించామన్నారు. సీవీఎస్‌వో ఘట్టమనేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ, భక్తుల భద్రతే ధ్యేయంగా భద్రత కల్పించామన్నారు. ఉత్సవాలకోసం రెట్టింప స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టామన్నారు. 

 

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top