నవభారతం నలుగుతోంది..!
• అధిక సమస్యలు వసతి గృహాల్లో ఉన్న చిన్నారులకే..
• రుతుచక్రం, రక్తహీనతతో విద్యార్థినుల ఇబ్బందులు
• వేధిస్తున్న దంతసమస్యలు, చర్మవ్యాధులు
• రాష్ట్రీయ బాలస్వాస్థ్తో వెలుగులోకి వచ్చిన చేదునిజాలు
ఈ ఫొటోలో కన్పిస్తున్న బాలుడి పేరు మల్లికార్జున్. వయస్సు13. మాగనూర్ మండలం తంగిడి గ్రామం. ఆ ఊరి ప్రాథమిక పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడికి జన్యులోపంతోనే వీపుభాగంలో కణితి లాంటిది ఏర్పడింది. గతంలో తల్లిదండ్రులు ఆస్పత్రులకు చూపించారు. వైద్యం కోసం ఎక్కువ ఖర్చులు అవుతాయని అలాగే వదిలేశారు. ఇటీవల ఆర్బీఎస్కేలో భాగంగా తంగిడి పాఠశాలను సందర్శించిన టీం సభ్యులు ఆ బాలుడు జన్యులోపంతో బాధపడుతున్నట్లు గుర్తించి చికిత్స కోసం ఎంపిక చేశారు.
మహబూబ్నగర్ క్రైం : జిల్లాలో 0–18ఏళ్ల మధ్య ఉన్న బాలబాలికలు చాలా వరకు పలు రకాల అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. నవంబర్14నుంచి ఈనెల మొదటి వారం వరకు రాష్ట్రీయ బాలస్వాస్థ్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల కళాశాల్లో, ఇంటర్ కళాశాలలో, అంగన్వాడీ సెంటర్లో 26,682 మంది విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించగా వెల్లడైన కఠోర నిజాలివి.పోషకాహార లోపాలు, తదితర ఆరోగ్య సమస్యలు భావి భారత పౌరులను బలి చేస్తున్నాయి. వీరి సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా నిష్పలమే అవుతున్నాయి. ఫలితంగా బాల మేధస్సు మరుగున పడుతోంది.
ఇక్కడే ఎక్కువ..
మక్తల్ నియోజకవర్గంలో ఉన్న పాఠశాలలు, ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాల వసతి గృహలలో 70మంది రక్తహీనత, 51మంది చర్మవ్యాధులతో, 56మంది కీళ్లు,శ్వాసకోశ సమస్యలు, విటమిన్ ‘ఏ’లోపంతో బాధపడుతున్నట్లు వైద్యలు గుర్తించారు. తాగేనీరు కలుషితం కావడం వల్లే జబ్బులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశా>లలు, వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా పలు రకాల సమస్యలు బయటపడ్డాయి. దీంట్లో చాలా మంది రక్తహీనత, రుతుచక్రం, దంత సమస్యలు, విటమిన్ ఏలోపం, థైరాయిడ్, చర్మవ్యాధులతో, పోషకాహార లోపంతో అవస్థలు పడుతున్నట్లు వెల్లడైంది. ఇక్కడ పిల్లలకు అందిస్తున్న ఆహారంలో నాణ్యత పాటించడం లేదని అధికారులు గుర్తించినట్లు తెలిసింది. నారాయణపేట నియోజకవర్గంలో చాలా మంది విద్యార్థులు కంటిచూపుతోపాటు బరువు తక్కువ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలింది.
ఆర్బీఎస్కే ముఖ్య ఉద్దేశమేమిటంటే..
జిల్లాలో ఉండే 0–18ఏళ్ల బాలబాలికలకు జన్మతహ ఏర్పడే లోపాలు, వ్యాధులు, లోపాలు క్షీణితలు, ఎదుగుదల జాప్యం ఉన్న వారిని కనుగొని వ్యాధి నిర్ధారణ చేయడానికి ఏర్పాటు చేసిందే ఈ ఆర్బీఎస్కే. దీంట్లో బాలబాలికలకు స్క్రీనింగ్ నిర్వహించి ఆ తర్వాత వారికి రోగం ఉందో లేదో తెలుసుకుంటారు. ఒకవేళ అనారోగ్యం ఉందని నిర్ధారణ అయిన వారికి ఎన్ఆర్హెచ్ఎం కింద ఉచిత ఖర్చుతో తృతీయ స్థాయిలో శస్త్ర చికిత్స నిర్వహణతోపాటు సేవలు అందిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల మధ్య పటిష్టమైన భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యం కింద ఈ పథకం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు. ఈ పథకం ద్వారా శిశుమరణాలు తగ్గించే విషయంలో చాలా పురోగతి సాధించడానికి అవకాశం ఉంటుంది. శిశువులలో ఆరోగ్య పరిస్థితులను ముందే తెలుసుకోని అవసరం చికిత్స అందించడానికి వీలు ఉంటుంది. ముందే చికిత్స చేయడం వల్ల శిశువుల మనుగడ, పౌష్టికాహార లోపం తగ్గడం, విజ్ఞాన వికాసం పెరగడం పూర్తిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
జిల్లాలో 5.24 లక్షల మంది బాలబాలికలు
జిల్లాలో 0–18 ఏళ్లు కల్గిన బాలబాలికలు 5.24లక్షల మంది ఉన్నారు. వారందరికి లబ్ధి చేకూర్చడానికి అమలు చేస్తుందే ఈ పథకం. నవజాత శిశువులను ఆస్పత్రులలో, గృహాల దగ్గర పరీక్షిస్తారు. వారితో పాటు అంగన్వాడీ సెంటర్లలో, ప్రాథమిక పాఠశాల, ప్రాథమిక ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న బాలబాలికలకు పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే పాఠశాలలో ఆరోగ్య పరిస్థితి విశ్లేషణ కింద పరీక్షలు చేస్తున్నారు దీనిని పొడగిస్తూ అప్పుడే పుట్టిన శిశువునుంచి 18ఏళ్లు ఉన్న బాలబాలికలకు ఆర్బీఎస్కే కింద పరీక్షలు చేస్తున్నారు.
జాగ్రత్తలు ఇవీ..
పిల్లల్లో రక్తహీనత కలగకుండా ఉండాలంటే రోజూ ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు, పండ్లు, బెల్లం, మాసం, ఖర్జూరం ఆహారంలో తప్పనిసరి ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. కంటిచూపు తగ్గకుండా ఉండటానికి నిత్యం విటమిన్ ఏఉండే ఆహారం తీసుకోవాలి. మునగ ఆకు, తోటకూర, మెంతికూర, క్యారెట్, మంచి గుమ్మడి, మామిడి బొప్పాయి వంటి పండ్లు అందించాలి. థైరాయిడ్ సమస్య రాకుండా ఆహారంలో ఆయోడిన్ లోపం లేకుండా చూసుకోవాలి.