బోర్వెల్ లారీని ఢీకొన్న కారు
– అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం..
నలుగురికి తీవ్ర గాయాలు
– అందరిదీ ఒకే కుటుంబం.. స్వగ్రామం మెదక్ జిల్లా సిద్ధిపేట
– నెల్లూరు జిల్లా కావలి దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
– కొనకనమిట్ల మండలం మర్రిచెట్లపాలెం సమీపంలో ఘటన..
కొనకనమిట్ల : రోడ్డు పక్కన ఆగి ఉన్న బోర్వెల్ లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మార్కాపురం– కొనకనమిట్ల జాతీయ రహదారిలోని మర్రిపాలెం సమీపంలో బుధవారం తెల్లవారు జామున జరిగిం ది. వివరాలు.. తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా సిద్ధిపేటకు చెందిన ఆరుమూరి రవికుమార్ తన కుటుంబ సభ్యులు ఆరుగురితో కలిసి నెల్లూరు జిల్లా కావలి వెళ్లి అక్కడ దైవదర్శనం చేసుకొని తిరిగి అదే కారులో స్వగ్రామం బయల్దేరారు. కారు కొనకనమిట్ల మండలం మర్రిపాలెం సమీపంలోకి వచ్చే సరికి మార్కాపురం వైపు వెళ్తున్న బోర్వెల్ లారీ మార్జిన్లో ఆగి ఉంది. లారీ వెనక భాగాన్ని కారు బలంగా ఢీకొట్టింది. కారు ముందు భాగంలో కూర్చొన్న ఆరుమూరి సుధాకర్ (36), ఆరుమూరి సుజన్కుమార్ (12)లు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వరుసకు తండ్రీకొడుకు అవుతారు. కారు నడుపుతున్న సుజన్కుమార్ తండ్రి రవికుమార్, తల్లి రాజేశ్వరి, పిన్ని శ్రీలక్ష్మి, తమ్ముడు నవీన్కుమార్లు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఇన్చార్జి ఎస్సై కె.అజయ్కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులను ఒంగోలు వైద్యశాలకు తరలించారు. లారీ వెనక భాగంలో ఇరుక్కున్న కారును పొక్లెయిన్ సాయంతో బయటకు తీయించా రు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అజయ్కుమార్ తెలిపారు.
ఎక్కడో పుట్టి ఇక్కడ మృత్యు ఒడికి..
సంఘట స్థలానికి స్థానికులు పెద్ద ఎత్తున వచ్చారు. ఎక్కడో పుట్టి పెరిగి ఇక్కడ మృత్యు ఒడికి చేరారు పాపం.. అంటూ స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రవికుమార్ తన భార్య రాజేశ్వరి, కుమారులు సుజన్కుమార్, నవీన్కుమార్, తమ్ముడు సుధాకర్, మరదలు శ్రీలక్ష్మితో కలిసి నెల్లూరు జిల్లా కావలి వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం ముగించుకుని సంతోషంగా ఇంటికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తమ్ముడు సుధాకర్, కుమారుడు సుజన్కుమార్ మృతి చెందటాన్ని రవికుమార్ జీర్ణించుకోలేకపోతున్నారు.