అశ్లీల చిత్రాల ముఠా గుట్టు రట్టు
ఆమదాలవలస : జిల్లాలో వారం రోజులుగా సంచలనం సృష్టిస్తున్న ఆమదాలవలసలో అశ్లీల చిత్రాల చిత్రీకరణ ముఠా గుట్టు రట్టయింది. దీనికి సంబంధించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని సీఐ నవీన్కుమార్ వెల్లడించారు. ఈ మేరకు తన కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్పీ ఆదేశాలతో కేసు దర్యాప్తు చేశామని అందులో కొత్తకోటవారివీధికి చెందిన చింతాడ మహేష్ అనే యువకుడు తానే స్వయంగా అశ్లీల చిత్రంలో ఉంటూ చిత్రీకరించిన వీడియో ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లామని చెప్పారు. ఈ క్రమంలో మహేష్ స్నేహితులైన ఆమదాలవలస పట్టణానికి చెందిన సీపాన రమేష్, నానుపాత్రుని సంతోష్, పేడాడ వెంకటరావులను మూడు రోజుల కిందట అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేశామన్నారు.
దర్యాప్తులో భాగంగా ఒక హార్డు డిస్క్, మూడు సెల్ఫోన్లు, ఒక ట్యాబ్, ఒక పెన్డ్రైవ్ను స్వాధీనం చేసుకున్నామని అందులో అశ్లీల చిత్రాలు చిత్రీకరించినది, వేరొక ప్రాంతాలకు చెందినవి లభ్యమయ్యాయని తెలిపారు. ప్రధాన సూత్రధారి మహేష్తో అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటున్న సమయంలో ఆ చిత్రాలను చేజిక్కించుకున్న రమేష్, సంతోష్ అక్కడితో ఆగకుండా అవి పట్టణంలో చాలా మంది వ్యక్తుల మెుబైల్స్కు, కంప్యూటర్లకు పంపిస్తూ ప్రచారం చేసినట్టు వారే స్వయంగా ఒప్పుకున్నారని సీఐ చెప్పారు. వీరితో పాటు కొర్లకోట గ్రామానికి చెందిన క్రిష్ణారావు ఈ చిత్రాలను ప్రసారం చేశాడనే ఆరోపణలతో అరెస్టు చేసి వీరిపై పలు సెక్షన్లు కింద కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. త్వరలోనే ప్రధాన సూత్రధారి మహేష్ను పట్టుకుంటామని సీఐ చెప్పారు.
మహేష్ ఉచ్చులో ఉన్న వారు భయపడాల్సిన అవసరం లేదని, ఆయన వద్ద ఉన్న వీడియోస్ బయటకు రాకుండా చూసే బాధ్యత పోలీసులేదనని తెలిపారు. దీనికి సంబంధించి ఎవరి వద్ద ఏ సమాచారం ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కార మార్గం చూపిస్తామని చెప్పారు. సెల్ఫోన్ దుకాణాల్లో, కంప్యూటర్ సెంటర్లలో, యువకుల సెల్ఫోన్లలో అటువంటి నీలిచిత్రాలు బయటపడితే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కేసు దర్యాప్తులో ఏఎస్ఐ సుధాకర్, పీసీలు ఉమాతిరుమలసాయి, ఏఎస్ఐ నాగేశ్వరరావు తదితరులు ప్రధాన పాత్ర పోషించారని వారిని అభినందించారు.