తిరుమలలో బ్యాటరీ బస్సులు
తిరుపతి అర్బన్: తిరుమల పుణ్యక్షేత్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు త్వరలో బ్యాటరీ ద్వారా నడిచే బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. తిరుపతిలోని టీటీడీ రవాణా విభాగంలో గురువారం నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీటీడీ రవాణాశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే తిరుమల, తిరుపతిలో యాత్రికుల సౌకర్యార్థం ఉచిత బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు.
అయితే తిరుమలను పూర్తి కాలుష్య రహితంగా మార్చే క్రమంలో రెండు బ్యాటరీ(ఎలక్ట్రికల్ ఆధారిత) బస్సులను ప్రయోగాత్మకంగా నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. టీటీడీ డ్రైవర్లు కూడా తమ నైపుణ్యం, అనుభవంతో తిరుమల ఘాట్రోడ్డును ప్రమాదరహితంగా మార్పుచేసి అందరి మన్ననలు పొందుతున్నారని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన డ్రైవర్లకు సూచించారు.