నగదు రహితంపై కళాప్రదర్శనలు
► బ్యాంకింగ్ లావాదేవీలపై ప్రజల్లో చైతన్యం
► తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఆటాపాటలు
ఎల్లారెడ్డిపేట: నగదు రహితంపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి తెలంగాణ సాంస్కృతిక సారథి నడుం బిగించింది. సాంస్కృతిక సారథి జిల్లా కళాబృందం ఎడమల శ్రీధర్రెడ్డి, పౌర సంబంధాల శాఖ సంయుక్తంగా కళాకారుల బృందం ఎల్లారెడ్డిపేట మండలం పలు గ్రామాలలో సంచరిస్తూ తమ ఆటపాటల ద్వారా నగదు రహితంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మొబైల్, ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా అమ్మకాలపై వివరిస్తున్నారు. నగదు రహితంపై ప్రజలు అవగాహన లోపంతో ఉండగా వారి వద్దకు వెళ్లి వారి భాషలోనే తెలంగాణ యాస, భాష పాటలతో వివరిస్తూ కళాబృందం తమ బాధ్యతను నేరవేర్చుతోంది.
జిల్లాలోని ప్రతీ గ్రామంలో కళాబృందం నగదు రహితం, ఆన్ లైన్, బ్యాకింగ్ సేవలపై ప్రజలను చైతన్యం చేయడానికి ముందుకుపోనున్నట్లు కళాసారథి బృందం బాధ్యుడు శ్రీధర్రెడ్డి తెలిపారు. నగదు రహితంతో పాటు వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగం ప్రతీ ఒక్కరి బాధ్యతగా భావించాలని గ్రామాల్లో హితబోధ చేస్తున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల వాడకం, వాటి ప్రయోజనాలపై కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడానికి కళాబృందం సభ్యులు ముందుకు సాగుతున్నారు.