ఒక్కటైన ప్రేమ జంట

ఒక్కటైన ప్రేమ జంట


పర్సు మరిచిపోయిన యువతితో ప్రేమలో పడిన ఆటోడ్రైవర్‌

ఇరు కుటుంబాలు అంగీకరించడంతో వివాహం  




ఖిల్లా ఘనపురం: పల్లెటూరుకు చెందిన ఓ యువకుడు బతుకుదెరువుకోసం హైదరాబాద్‌ వెళ్లి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆ ఆటోలో ఎక్కిన యువతి తన పర్సు మరిచిపోయి దిగింది. ఆ పర్సులో రూ.6వేల నగదుతో పాటు ఏటీఎం కార్డులు, ఫోన్‌ బుక్కు ఉండడంతో ఆ అమ్మాయికి ఫోన్‌ చేసి ఆమె సామగ్రి అందజేసిన డ్రైవర్‌.. ఆ తర్వాత ఆమెతోనే ప్రేమలో పడ్డాడు. వీరిద్దరి ప్రేమను తొలుత నిరాకరించగా గుడిలో వివాహం చేసుకున్నప్పటికీ ఇరువురి కుటుంబాలు ఆ తర్వాత ఓకే చెప్పడంతో మళ్లీ వినాయకుడి సాక్షిగా ఆదివారం పెళ్లి చేసుకున్నారు. సినిమా కథను తలపించే ఈ స్టోరీ వివరాలు...  



వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం గ్రామానికి చెందిన వడ్డె కొండన్న, రామచంద్రమ్మ దంపతుల కుమారుడు రామస్వామి హైదరాబాద్‌లో ఆటో నడుపుతున్నారు. అక్కడే సూపర్‌మార్కెట్‌లో పనిచేసే శిరీష ఆటోలో వెళ్లి దిగిపోయే క్రమంలో పర్సు మరిచిపోయింది. అందులో నగదు, ఏటీఎం కార్డులు, ఫోన్‌బుక్‌ ఉండడంతో రామస్వామి ఆమెకు ఫోన్‌ చేశాడు. ఆ తర్వాత గచ్చిబౌలి దగ్గర సూపర్‌మార్కెట్‌లో ఉన్న శిరీష వద్దకు వెళ్లి పర్సు అప్పగించగా పరిచయం ప్రారంభమైంది.



ఇక అప్పటి నుంచి తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటుండడంతో ప్రేమ చిగురించింది. ఇరువురి కులాలు వేరు కావడంతో ఈనెల 25న బాల్‌నగర్‌ సమీపంలోని అయ్యప్పస్వామి దేవాలయంవివాహం చేసుకున్నారు. విషయం తెలిసి ఇరుకుటుంబాల వారు పెద్ద మనుషులతో కలిసి సోమవారం ఖిల్లాఘనపురంలో పంచాయతీ నిర్వహించగా.. అందరూ అంగీకరించారు. దీంతో ఖిల్లాఘనపురంలోని వడ్డెగేరి సమీపాన ప్రతిష్ఠించిన వినాయకుడి దగ్గర ఇరుకుటుంబాల సమక్షంలో రామస్వామి, శిరీష మళ్లీ పెళ్లి చేసుకున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top