ఆటో, కారు ఢీ
రాజాం : సంతకవిటి మండలంలోని గుళ్ళసీతారాంపురం-ఎస్.రంగారాయపురం గ్రామాల మధ్య ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో-కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టాయి. జీఎస్పురం వైపు నుంచి సంతకవిటి వైపు వస్తున్న కారు, తాలాడ వైపు నుంచి రాజాం వైపు వెళ్తున్న ఆటో పరస్పరం మలుపు వద్ద ఢీకొట్టాయి. తాలాడ వైపు నుంచి ప్రయాణికులుతో రాజాం వైపు వెళ్తున్న ఆటో ఎస్. రంగారాయపురం గ్రామం వద్ద ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును తప్పించే ప్రయత్నం చేశారు. ఇంతలో మలుపు ఉండడంతో ఎదురుగా వస్తున్న కారును చూసుకోలేకపోవడంతో కారు-ఆటోలు పరస్పరం ఢీకొని ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ఆటో రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి పడిపోగా ఆటోలో ప్రయాణిస్తున్న సంతకవిటి మండలంలో పోతురాజుపేట గ్రామానికి చెందిన పోతురాజుపేట పార్వతి, దిలీప్లతో పాటు ఎస్.రంగారాయపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రాములు గాయాలయ పాలయ్యారు. మరోవైపు రేగిడి మండలం బూరాడ గ్రామానికి చెందిన గులివిందల అప్పలనాయుడుకు చెందిన కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. స్థానికులు 108 వాహనంలో క్షతగాత్రులను రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. 108 సిబ్బంది అచ్చుతరావు, దుర్గాప్రసాద్తో పాటు రాజాం సీహెచ్సీ సూపరింటెండెంట్ గార రవిప్రసాద్లు ప్రాథమిక చికిత్సను అందించి, బాధితులకు మెరుగైన వైద్యం అందించారు. ఈ సంఘటనపై సంతకవిటి పోలీసులకు ఎటువంటి సమాచారం అందలేదు.