వైఎస్సార్ సీపీ నేతపై దుండగుల దాడి


చీరాల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ పట్టణ కన్వీనర్ దాసరి శ్రీకాంత్, ఆయన భార్య విజయపై గుర్తు తెలియని ఏడుగురు దాడి చేసి గాయపరిచారు. ఈ సంఘటన స్థానిక ఐఎల్‌టీడీ రామ్‌నగర్‌లోని శ్రీకాంత్ నివాసం వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగింది.



ఈ విషయమై శ్రీకాంత్‌తో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ కొరబండి సురేష్, మున్సిపల్ కౌన్సిలర్ మొగిలి బాబ్జీ, మాజీ కౌన్సిలర్ మల్లెల బుల్లిబాబు, స్థానికులు కలిసి టూటౌన్ సీఐ పి.పరంధామయ్యకు ఫిర్యాదు చేశారు. బాధితుడు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకాశం... దాసరి శ్రీకాంత్ తన ఇంటి వద్ద స్నేహితులు రాజేష్, సురేష్‌లతో మాట్లాడుతున్నాడు. తొలుత ఆటోలో వచ్చిన నలుగురు శ్రీకాంత్‌ను కిందపడేసి తీవ్రంగా కొట్టి గాయపరిచారు. ఇంతలో మరో ముగ్గురు కారులో వచ్చి శ్రీకాంత్‌పై దాడికి దిగారు. స్నేహితులు రాజేష్, సురేష్ ఎందుకు కొడుతున్నారంటూ వారించినా వినకుండా వారిని అక్కడి నుంచి తరిమేశారు.



కేకలు విన్న శ్రీకాంత్ భార్య పరుగున ఇంట్లో నుంచి వచ్చి తన భర్తను ఎందుకు కొడుతున్నారని నిలదీసింది. ఆమెపై కూడా దాడికి దిగారు. అంతటితో ఆగకుండా శ్రీకాంత్‌ను వాహనంలో ఎక్కించుకునేందుకు విఫలయత్నం చేశారు. బాధితుడు పెద్దగా కేకలేశాడు. స్థానికులు రావడంతో ఏడుగురూ కారులో పరారయ్యారు. కారు నంబర్ కనిపించకుండా గ్రీసు పూసి ఉంది. స్థానికులు అతి కష్టంపై గ్రీసును తుడిచి నంబర్‌ను గుర్తించగలిగారు. అంతా ఒక్కటై టూటౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకుని సీఐ పి. పరంధామయ్యకు ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని శ్రీకాంత్ కుటుంబ సభ్యులు సీఐను వేడుకున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top