ఒంగోలులో పురావస్తు ప్రదర్శనశాల
రాష్ట్ర ఆర్కియాలజీ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణారావు
ఒంగోలు కల్చరల్:
రాష్ట్రంలోని పురావస్తు ప్రాధాన్యత ఉన్న కట్టడాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ జి.వి. రామకృష్ణారావు వెల్లడించారు. పురావస్తు కార్యాలయాన్ని గొల్లపూడికి తరలించేందుకు, మరిన్ని పురావస్తు పరిశోధనలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. స్థానిక సీఎస్ఆర్ శర్మ కళాశాలలో చరిత్ర శాఖ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాౖటెన జాతీయ సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
è రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో రక్షిత కట్టడాల సంఖ్య కేవలం 277. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు కృషి చేస్తున్నాం.
è పురావస్తు శాఖ కార్యాలయాన్ని గొల్లపూడికి తరలించే ప్రయత్నాలు ప్రారంభించాం. గొల్లపూడిలోని ఎల్ఐసీ కాలనీ వసుధా షెల్టర్స్ ఎన్ఆర్ఐ స్కూలు భవనం మొదటి అంతస్తులో కార్యాలయాన్ని ఏర్పాటుచేసేందుకు భవన యజమానులతో ఎంఓయూకూడా కుదుర్చుకున్నాం. డిసెంబరులోగా తరలింపు పూర్తి కావచ్చని భావిస్తున్నాం.
è ఆర్కియాలజీకి సంబంధించినంతవరకు శాసనాలు, రికార్డులు, పలు విభాగాల్లో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్లకు ఏవేవి పంపకం చేయాలనే దానికి సంబంధించి ఆరుగురు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాౖటెంది. కమిటీ నివేదిక డిసెంబరులోగా వచ్చే అవకాశం ఉంది.
è రాష్ట్ర ఆర్కియాలజీ విభాగానికి సిబ్బంది కొరత బాగా ఉంది. నాలుగో తరగతి ఉద్యోగులు ఒక్కరుకూడా లేరు. అందుకే జౌట సోర్సింగ్ పద్ధతిలో వీరితో పాటు జూనియర్ అసిస్టెంట్లను నియమించేందుకు ప్రభుత్వ అనుమతి కోసం చూస్తున్నాం.
è వారసత్వపరంగా ప్రాధాన్యత ఉన్న వాటిని సంరక్షించేందుకు చర్యలు చేపడుతున్నాం. దీనిలో భాగంగా విజయనగరంలో గురజాడ అప్పారావు ఇంటితోపాటు అనంతపురంలో పీస్ మెమోరియల్ హాల్ పరిరక్షణకు చర్యలు తీసుకున్నాం.
è తూర్పు గోదావరిజిల్లాలోని అనంతవరం కొండపై చేపట్టిన తవ్వకాల్లో క్రీస్తు శకం 2–4 శతాబ్దాలకు చెందిన అపురూప బౌద్ధ సంస్కృతీ ఆనవాళ్లు లభ్యమయ్యాయి. బౌద్ధారామాలకు సంబంధించి జరిపిన తవ్వకాలలో 8 ఉద్దేశిక స్థూపాలు, మహా చైత్యం, బౌద్ధ స్థూప ఫలకాలు, బుద్ధుని జాతక కథలకు సంబంధించిన శిల్పాలు, విహార గదులు, మృణ్మయ పాత్రలు వంటివి వెలుగుచూశాయి.
è రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పురావస్తు ప్రదర్శన శాలల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం. విజయనగరం, ఒంగోలుతోపాటు పలు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేస్తాం. ఒంగోలులో స్థల సేకరణ పురోగతిలో ఉంది. స్థలం లభించగానే మ్యూజియం ఏర్పాటు చేయడంతోపాటు కలెక్టర్ బంగ్లాలోని జైన విగ్రహాలను జిల్లా అధికార యంత్రాంగం అనుమతితో అందులోకి తరలించే చర్యలు చేపడతాం.
è కనపర్తిలో వెలుగుచూసిన బుద్ధ విగ్రహాలను కెమికల్ ట్రీట్మెంట్ కోసం ఆర్కియాలజీ అధికారులకు స్వాధీనం చేయాలని కలెక్టర్ సుజాతా శర్మ ఆదేశించినప్పటికీ అధికారులు తాత్సారం చేస్తున్నారు. దీనిని కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం.
è ఆగస్టు 12 నుంచి జరిగే కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని అవనిగడ్డలోని లక్ష్మీనారాయణ ఆలయంతోపాటు శ్రీకాకుళ ఆంధ్రదేవ ఆలయాన్ని 85లక్షల రూపాయలతో సుందరీకరించడంతోపాటు మరమ్మతులు చేపట్టాం.
è జిల్లాలోని చందవరం బౌద్ధస్తూపాన్ని మరింతగా అభివృద్ధి పరచాల్సి ఉంది. మహాబలేశ్వరస్వామి ఆలయం గోడ మరమ్మతులు చేపట్టడంతోపాటు దూపాడు బౌద్ధారామ అభివృద్ధి చర్యలు తీసుకుంటాం.