ఆరు నెలలకోసారి ఆర్జిత సేవా టికెట్లు
టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు
సాక్షి, తిరుమల: శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవల్లో ఎక్కువమంది భక్తులు పాల్గొనే అవకాశం కల్పించటంలో భాగంగా ఇకపై ఆరు నెలలకు (180రోజుల) ఒకసారి మాత్రమే సేవా టికెట్లు బుక్ చేసుకునే పరిమితి విధించామని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... దీనిప్రకారం ఒకసారి టికెట్టు పొందిన భక్తుడు మరోసారి 180 రోజుల తర్వాత మాత్రమే టికెట్టు పొందడానికి వీలవుతుందన్నారు.
ఇదే సందర్భంగా ఏప్రిల్ 1 నుంచి 30వ తేది వరకు నిర్వహించే 50వేల ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేశారు. ఇందులో సుప్రభాతం 6,115, అర్చన 120, తోమాల 120, విశేషపూజ 1,500, అష్టదళ పాదపద్మారాధన 40, నిజపాద దర్శనం 1,125, కల్యాణోత్సవం 9,750, వసంతోత్సవం 10,320, బ్రహ్మోత్సవం 5,590, సహస్రదీపాలంకారసేవ 12,350, ఊంజల్సేవ 2,600 టికెట్లు ఉన్నాయి.