ఏపీ సచివాలయ శంకుస్థాపన వాయిదా!!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ఈ నెల 12న జరగాల్సిన శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడింది. టెండర్లు ఖరారుకాకపోవడంతో సీఆర్డీఏ అధికారులు ఈ కార్యక్రమం వాయిదా వేసినట్లు తెలుస్తుంది.
ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే నిర్మాణ సంస్థలు అధికంగా టెండర్లు కోట్ చేయడంతో సీఆర్డీఏ అధికారులు టెండర్లను ఖరారు చేయలేదు. దీంతో రీ టెండర్లు పిలిచే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రెండు ప్యాకేజీలకు ఎల్అండ్టీ, ఒక ప్యాకేజీకు షాపూర్జీ పల్లోంజీ సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే 35 శాతం అధిక ధరతో ఈ సంస్థలు కోట్ చేశాయి. ఈ నేపథ్యంలో సీఆర్డీఏ అధికారులు, మంత్రి నారాయణ ఆ సంస్థల ప్రతినిధులతో సోమవారం సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ చర్చలు సఫలం కానీ పక్షంలో కొత్తగా టెండర్లు పిలిచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది.