కృష్ణా పుష్కరాలకు కొత్త వెలుగులు
సాక్షి, విజయవాడ బ్యూరో: వచ్చే ఏడాది జరిగే కృష్ణా పుష్కరాలకు విద్యుత్ శాఖ సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో కృష్ణా పుష్కరాలకు ప్రధాన కేంద్రమైన విజయవాడతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మిగతా ప్రాంతాలకూ భారీ సంఖ్యలో భక్తులు వచ్చే వీలున్నందున విద్యుత్ శాఖ పరంగా ఏర్పాట్లు ఘనంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
రెండ్రోజుల కిందట విజయవాడ వచ్చిన సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సీఎండీ హెచ్వై దొర ఇక్కడి స్నానఘాట్లను పరిశీలించారు. అధికారులతో సమావేశమై సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, కొత్త లైట్ల ఏర్పాటుపై సమీక్షించారు. ఆగస్టు 15 కల్లా ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
దీంతో ఏపీఎస్పీడీసీఎల్ విజయవాడ జోన్ చీఫ్ ఇంజనీర్ రాజబాపయ్య నేతృత్వంలో ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. 2 జిల్లాల్లోనూ 14 వేల కొత్త బల్బులు, విజయవాడలో సుమారు 300 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. భవానీపురం, మొగల్రాజపురం ప్రాంతాల్లో ఏపీ ట్రాన్స్కో రెండు కొత్త ఇండోర్ (132కేవీ) సబ్స్టేషన్లు నిర్మిస్తోంది.