అంత్యపుష్కరాలను ప్రారంభించిన చినరాజప్ప
రాజమహేంద్రవరం : అంత్యపుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఎన్. చినరాజప్ప వెల్లడించారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సరస్వతి ఘాట్లో అంత్య పుష్కరాలను చినరాజప్ప ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో అన్ని పుష్కర ఘాట్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు చినరాజప్ప తెలిపారు. గోదావరిలో పలువురు ప్రముఖులు పుణ్యస్నానాలు చేశారు. గోదావరి అంత్య పుష్కరాలు నేడు ప్రారంభమైనాయి. ఆగస్టు 11వ తేదీతో ఈ పుష్కరాలు ముగియనున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలో భక్తులు ఆదివారం పుణ్యస్నానాలు ఆచరించారు. అంత్యపుష్కరాల నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు గోష్పాద క్షేత్రంలోని గౌతమి ఘాట్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గోదావరికి రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్ హారతి సమర్పించారు. అలాగే నరసాపురంలో వశిష్ట ఘాట్లో అంత్య పుష్కరాలను దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరావు ప్రారంభించారు.
సంబంధిత వార్తలు