అచ్చ తెలుగు రుచి.. ‘ఆంధ్ర భోజనం’
విజయవాడ కల్చరల్ : సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలు తెలుగువారి వంటకాలు, ఆహారపు అలవాట్లు అని జాతీయ పురస్కార గ్రహీత, రచయిత, సినీ గేయరచయిత సుద్దల అశోక్తేజ పేర్కొన్నారు. విలువిద్య క్రీడాకారుడు చెరుకూరి లెనిన్ ఆరో వర్ధంతి సభ మహానాడు రోడ్డులోని ఓల్గా ఆర్చరీ క్రేందంలో సోమవారం జరిగింది. ఓల్గా సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో తెలుగువారి వంటలు, ఆహార అలవాట్లు ప్రధానంగా ఓ గీతాన్ని తయారుచేసి సీడీగా రూపొందించారు. గీత రచయిత, ముఖ్య అతిథి అశోక్తేజ మాట్లాడుతూ తెలుగు వంటకాలకు సుదీర్ఘమైన చరిత్ర ఉందన్నారు. 12 నిమిషాల పాటలో ఆయా ప్రాంతాల్లోని దేవాలయాల్లో తయారుచేసే ప్రసాదాలు, సంస్కృతీ సంప్రదాయాలను ప్రస్తావిస్తామన్నారు. అమరావతి ప్రాధాన్యతను వర్ణిస్తూ రాసిన గీతం జీవితంలో మరిచిపోలేని సంఘటన అని, అందుకు కారణం చెరుకూరి సత్యనారాయణ అని పేర్కొన్నారు. ఆంధ్ర భోజనం గీతానికి సాహిత్యం అందించానని, యువ గాయనీ, గాయకులు ధనంజయ సాయి, చరణ్, రాంకీ, విష్ణుకిషోర్, గాయత్రీ నారాయణ్, శ్రీదేవి, మాధవి గాత్ర సహకారం అందించారని తెలిపారు. కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ ఆయా ప్రాంత రుచులు, తినుబండారాలు కూడా చరిత్ర గురించి వివరిస్తాయన్నారు. ఆంధ్రా ఆర్ట్ అకాడమీ ప్రధాన కార్యదర్శి గోళ్ల నారాయణరావు, ఓల్గా ఆర్చరీ నిర్వాహకుడు చెరుకూరి సత్యనారాయణ, కార్పొరేటర్ దేవినేని అపర్ణ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా సంగీత దర్శకుడు యశోకృష్ణ నిర్వహణలో గాయనీ గాయకులు ఆంధ్ర భోజనం గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా చిన్నారి శివాని.. లెనిన్ చిత్రపటానికి బాణంతో నమస్కారం సంధించి ఆకట్టుకుంది. సీపీఐ నాయకులు దోనేపూడి శంకర్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.