యువకుని హత్య...ఆపై కాల్చివేత
కడప అగ్రికల్చర్: గుర్తు తెలియని యువకుడిని హత్య చేసి ఎక్కడినుంచో తీసుకొచ్చి జన సంచారం లేని ప్రాంతంలో రోడ్డు పక్కన పడేసి కాల్చివేసిన సంఘటన కడప నగర శివార్లలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి రిమ్స్ సీఐ మోహన్ప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప నగర శివార్లలోని కేంద్ర కారాగారం నుంచి రిమ్స్కు వెళ్లే బైపాస్ రహదారిలోని రైల్వేబ్రిడ్జి సమీపంలో 25–27 సంవత్సరాల మధ్య వయసున్న యువకుడిని ఆటోలో తీసుకొచ్చి పడవేసి కాల్చినట్లు తెలుస్తోంది. కాలిన మృతదేహాన్ని పరిశీలించగా గొంతుకు చున్నీ బిగించి చేతులు, కాళ్లు వెనక్కి మడచి ప్లాస్టిక్ వైరుతో కట్టి దారుణంగా హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. అంతేకాకుండా ముఖం గుర్తు పట్టకుండా కాల్చేశారు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున జరిగి ఉండవచ్చని సీఐ తెలిపారు. సంఘటన స్థలాన్ని కడప డీఎస్పీ ఈజీ అశోక్కుమార్ సందర్శించారు.