లోకేశ్.. మీ స్థాయి ఏమిటి?

లోకేశ్.. మీ స్థాయి ఏమిటి? - Sakshi


గుంటూరు: వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చర్చకు పిలిచే అర్హత నారా లోకేశ్ కు లేదని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని ఇద్దరు బాబులు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష పార్టీని విచ్ఛిన్నం చేయడానికి ఎమ్మెల్యేలను కొంటుకున్నారని ఆరోపించారు. టీడీపీ అనైతిక విధానాలను జాతీయ స్థాయి నాయకులకు తెలపడానికే 'సేవ్ డెమొక్రసీ' పేరిట వైఎస్ జగన్ నాయకత్వంలో తమ పార్టీ నాయకులు ఢిల్లీకి వెళ్లారని చెప్పారు.



లోకేశ్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ ను చర్చకు రావాలని పిలిచే అర్హత లోకేశ్ కు లేదన్నారు. మీ స్థాయి ఏమిటి, ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చి గెలిచావా అంటూ లోకేశ్ ను ప్రశ్నించారు. లోకేశ్ తో చర్చకు వైఎస్ జగన్ రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. లోకేశ్ తో చర్చకు తాను వస్తానని, లేదంటే మా కార్యకర్తను పంపిస్తామని చెప్పారు. చర్చకు వస్తే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగతామని, కళ్లకు కట్టినట్టు ప్రజలకు తెలుపుతామని చెప్పారు.



ఉత్తరకుమారుడిలా పారిపోవద్దని.. రేపు సాయంత్రంలోగా డేట్, టైమ్ చెప్పాలని అన్నారు. ఎన్టీఆర్ భవన్ లోనైనా చర్చకు సిద్ధమని చెప్పారు. చంద్రబాబు ఆస్తుల ప్రకటనను పెద్ద డ్రామాగా అంబటి రాంబాబు వర్ణించారు. టీడీపీ కుట్రలను, కుతంత్రాలను ఛేదిస్తూ వైఎస్ జగన్ ముందుకు వెళుతున్నారని చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top