అమరావతి - సింగపూర్- మాయాజాలం

అమరావతి - సింగపూర్- మాయాజాలం - Sakshi


 *మాస్టర్ ప్లాన్ ఒప్పందంపై సంతకం చేసిన టో యెంగ్ రాజీనామా

 

 

 (వెబ్ ప్రత్యేకం)

 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం వెనుక బడా రియల్ ఎస్టేట్ వ్యాపారం దాగి ఉందంటూ మొదటి నుంచి వ్యక్తమవుతున్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. రాజధాని నిర్మాణం పేరుతో నిరుపేద  రైతుల నుంచి 34 వేల ఎకరాలను సేకరించిన ప్రభుత్వం ఇప్పుడు వాటిని తమకు అనుకూలమైన కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలన్న ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. రాజధాని వెనుక లక్ష కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం దాగి ఉందన్న అనుమానాలను బలపరుస్తూ సింగపూర్‌లో పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

 

 రాజధాని కోసం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ఏడాది కిందట రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంలో సంతకం చేసిన సింగపూర్ ప్రతినిధి టో యెంగ్ చేంగ్ ఇప్పుడు సింగపూర్ ప్రభుత్వ సంస్థ నుంచి తప్పుకొని ఒక బడా కార్పొరేట్ కంపెనీకి సీఈవోగా చేరిపోయారు. రాజధాని మాస్టర్ ప్లాన్ కోసం సింగపూర్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్ (ఐఈ) తో గతేడాది డిసెంబర్ 8 న ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్ తరఫున అప్పట్లో దాని సీఈవో అయిన టో యెంగ్ చేంగ్ దానిపై సంతకాలు చేశారు. అప్పట్లో ఇదంతా ప్రభుత్వానికి ప్రభుత్వానికి మధ్య (జీ2జీ) ఒప్పందంగా చెబుతూవచ్చారు. కానీ జరిగింది వేరు.

 

 ప్రైవేటు చేతుల్లో మాస్టర్ ప్రణాళికలు

 సంతకాలు చేసి సింగపూర్ తిరిగి వెళ్లిన ఆ ప్రతినిధి కొద్ది రోజులకే ఆ మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతను సింగపూర్‌లోని ప్రైవేటు కార్పొరేట్ సంస్థలైన సుర్భానా ఇంటర్నేషనల్, జురాంగ్ ఇంటర్నేషనల్ లకు అప్పగించేశారు. ఈ విషయం ప్రభుత్వానికి తెలిసినా కిమ్మనలేదు. అప్పటి నుంచి ఏడాది కాలంలో ఆ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి మూడు దశల్లో మాస్టర్ ప్లాన్లు (కేపిటల్ రీజన్ ప్లాన్, కేపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్, సీడ్ డెవలప్‌మెంట్ మాస్టర్ ప్లాన్) అందించారు. ఇదిగో రాజధాని అంటూ అత్యద్భుతమైన గ్రాఫిక్స్‌తో  పంచరంగుల చిత్రాలను చూపించారు.

 

 టో యంగ్ మాయాజాలం

 విచిత్రమేమంటే...! మాస్టర్ ప్లాన్ కోసం ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంలో సింగపూర్ ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్ సీఈవో అయిన టో ఎంగ్ చేంగ్ సంతకాలు చేశారు. సరిగ్గా ఏడాది తిరక్కముందే... ! టో యంగ్ చేంగ్ ఇంటర్నేషనల్ ఎంటర్‌పెజైస్ (ఐఈ) సంస్థ సీఈవో పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసి ఏం చేశారో తెలుసా... ఇప్పటికే ఒకటిగా విలీనమైన సుర్భానా-జురాంగ్ సంస్థలో సీఈవోగా  చేరబోతున్నారు. అంటే మాస్టర్ ప్లాన్లు తయారు చేసిన కంపెనీల్లోనే ఆయన సీఈవోగా చేరబోతున్నారన్నమాట. (మాస్టర్ ప్లాన్లు తయారయ్యే వరకు రెండు సుర్బానా, జురాంగ్  వేర్వేరు కార్పొరేట్ కంపెనీలుగా కొనసాగాయి) మాస్టర్ ప్లాన్ల పని పూర్తి కాగానే ఆ రెండు కంపెనీలు ఒకటిగా విలీనమయ్యాయి. ఇంకో విచిత్రమేమంటే... ఆ రెండు కంపెనీలు విలీనమైన తర్వాత  టో ఎంగ్ చేంగ్ ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్ నుంచి తప్పుకుని సుర్బానా-జురాంగ్ ఇంటర్నేషనల్ సీఈవోగా చేరుతున్నట్టు ప్రకటించారు.  ఏపీ ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంలో సంతకాలు చేసిన టో యంగ్ ఏ ప్రైవేటు కంపెనీలకైతే మాస్టర్ ప్లాన్ తయారు చేయమని పని అప్పగించారో ఆ కంపెనీలో ఇప్పుడు ఆయన సీఈవోగా చేరుతున్నారన్న మాట. జనవరి ఒకటవ తేదీన ఆయన సుర్బానా-జురాంగ్ ఇంటర్నేషనల్‌లో ఆయన సీఈవోగా బాధ్యతలు చేపడుతున్నారు.

 

 ఇక మాస్టర్ డెవలపర్ మాయాజాలం



మాస్టర్ ప్లాన్లు అందించిన తర్వాత దశ... రాజధాని నిర్మాణానికి సంబంధించి వ్యవహారాలన్నీ చూసుకోవడానికి ఒక మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేస్తారు. (రాజధానిలో అవసరమైన నిర్మాణాలకు సంబంధించి సర్వం మాస్టర్ డెవలపర్‌కు అప్పగించి వారి ద్వారా ఇన్వెస్టర్స్‌ను ఆహ్వానించి పనులు చేయించడమే మాస్టర్ డెవలపర్ పని) త్వరలోనే మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేస్తామని మాస్టర్ ప్లాన్లు అందించే దశ పూర్తి కాగానే ప్రభుత్వం ప్రకటించింది. అది కూడా స్విస్ చాలెంజ్ అనే పద్ధతిలో ఎంపిక చేస్తామని చెప్పింది.

 

 అలా ప్రకటించిన రోజునే సింగపూర్ వాణిజ్య మంత్రి మాస్టర్ డెవలపర్‌గా తాము పోటీ పడతామని ప్రకటించారు. ప్రకటించడమే ఆలస్యం... సింగపూర్‌కు చెందిన అసెండాస్-సిన్‌బ్రిడ్జి అనే ప్రైవేటు కార్పొరేట్ సంస్థ, సెమ్బ్‌కార్ప్ అనే మరో సంస్థ కలిసి తాము మాస్టర్ డెవలపర్‌గా పనిచేస్తామంటూ ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్)ను దాఖలు చేశాయి.

 

 స్విస్ చాలెంజ్‌లో మారిన సరిహద్దులు

 సింగపూర్ కంపెనీలు అందించిన మాస్టర్ ప్లాన్ల ఆధారంగా వాటిని అభివృద్ధి పరచడానికి మాస్టర్ డెవలపర్ ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా, తామున్నామంటూ అసెండాస్-సిన్‌బ్రిడ్జితో పాటు సెమ్బ్‌కార్‌్ిలు ముందుకొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిన మాస్టర్ ప్లాన్ల ప్రకారం సీడ్ కేపిటల్ ప్రాంతం 8 చ.కి.మీ ప్రాంతంలో మాత్రమే విస్తరించి ఉండాలి. కానీ విచిత్రమేమంటే.. ఈ సంస్థలు ఉన్నట్టుండి ఆ ప్రాంతాన్ని 16.9 చ.కి.మీ మేరకు పెంచేశాయి. రెండింతలకన్నా ఎక్కువ.

 

 అకస్మాత్తుగా విస్తరించిన పరిధి

 సీడ్ డెవలప్‌మెంట్ ప్రాంతమంటే... రాజధానిలో అత్యంత కీలకమైన రాజ్‌భవన్, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, ముఖ్యమంత్రి, మంత్రుల క్వార్టర్లు... వంటి అనేక నిర్మాణాలు వస్తాయి. 8 చ.కి.మీ పరిధి సరిపోతుందని నిర్ణయించిన తర్వాత ఇప్పుడు ఉన్నఫళంగా మాస్టర్ డెవలపర్‌గా రాబోతున్న కంపెనీలు ఆ పరిధిని 16.9 చ.కి.మీ లకు పెంచడంలోని ఆంతర్యమేంటి? సింగపూర్ కంపెనీలు అందించిన మూడు మాస్టర్ ప్లాన్లకు రాష్ట్ర కేబినేట్ ఇదివరకే ఆమోదం తెలిపింది. మరి అలాంటప్పుడు తాజాగా మళ్లీ పరిధి పెంచడంలోని మతలబేంటి? అంటే రాజధాని డెవలప్‌మెంట్ పేరుతో సింగపూర్ కంపెనీలు ఇక్కడి భూముల కన్నేశాయన్న మాట. అది రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా జరుగుతుందా అంటే ఎంతమాత్రం సాధ్యం కాదన్న విషయం అందరికీ తెలిసిందే.

 

 సింగపూర్‌లో ఏం జరుగుతోంది


అమరావతి రాజధాని నిర్మాణం కోసం మాస్టర్ డెవలపర్‌గా రంగంలోకి దిగడానికి సింగపూర్‌లో ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇంతకాలం వేర్వేరు కార్పొరేట్ కంపెనీలుగా ఉన్న అసెండాస్, సిన్‌బ్రిడ్జి కంపెనీలు ఇప్పుడు ఒక్కటయ్యాయి. ఆ రెండు సంస్థలు విలీనమై అసెండాస్-సిన్‌బ్రిడ్జిగా నామకరణం చేసుకున్నాయి. వీటికన్నా ముందు మాస్టర్ ప్లాన్లు రూపొందించిన సుర్భానా, జురాంగ్ కంపెనీలు విలీనమై సుర్భానా-జురాంగ్‌గా ఆవిర్భవించాయి. ఈ నాలుగు కంపెనీలు రెండు కంపెనీలుగా మారాయన్న మాట.

 

 ఇదిలావుండగా, సింగపూర్  జేటీసీ పేరుతో మరో కంపెనీ ఉంది. అసెండాస్-సిన్‌బ్రిడ్జి, సెమ్బ్‌కార్ప్, సుర్భానా-జురాంగ్‌లు జేటీసీతో కలిసి సంయుక్తంగా రాజధాని నిర్మాణం పేరుతో అమరావతిలో ప్రవేశించనున్నాయి. ఇవన్నీ కలిసి ఇప్పుడు ఒక కన్సార్టియమ్‌గా ఏర్పడ్డాయి.

 

 ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్ పాత్రేంటి?

 సింగపూర్ ప్రభుత్వ పరిధిలో ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్ (ఐఈ) ఒక కార్పొరేషన్‌గా పనిచేస్తుంది. ఇది చేసే పనేంటంటే... ఆ దేశంలోని వివిధ కార్పొరేట్ కంపెనీలకు బిజినెస్ సమకూర్చడమే దీని పని. ఆయా దేశాల్లో చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులపై కన్నేసి వాటిని చేపడుతామని ఇంటర్నేషన్ ఎంటర్‌ప్రైజెస్ ఒప్పందాలు చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ పనిని సింగపూర్‌లోని ఆయా రంగాల్లో నిపుణత కలిగిన కంపెనీలకు ఆ పనిని అప్పగించమే ఐఈ పని.

 

 అందులో భాగంగానే ముందుగా ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇక ఆ తర్వాత ఆ బాధ్యత నుంచి తప్పుకుంది. ఇప్పుడు అన్నీ ప్రైవేటు కంపెనీలే నేరుగా రంగ ప్రవేశం చేస్తాయి. ఐఈ పాత్ర ఎలా ఉంటుంది? అది ఎలా వ్యవహరిస్తుందన్న విషయాలు రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలందరికీ తెలిసిన విషయమే.

 

 ఇక్కడే ఉంది అసలు మతలబు

 ఐఈ ద్వారా మార్గం సుగమం చేసుకున్న తర్వాత ఆయా ప్రైవేటు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్న ఆయా ప్రభుత్వాలు, ప్రాజెక్టుల యాజమాన్యాలతో బేరసారాలు, సబ్-కాంట్రాక్టులు, చేసిన పనికి ప్రతిఫలంగా విపరీతమైన లాభాలను కోరడం, (అమరావతిలో డెవలప్‌మెంట్ చేసినందుకు ప్రతిఫలంగా 3 వేలకుపైగా ఎకరాల భూములు అప్పగించాలని ఆయా కంపెనీలు కోరుతున్న విషయం తెలిసిందే) దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తమ బినామీలకు సబ్-కాంట్రాక్ట్లు.... ఇలా ఒక్కొక్కటిగా సాగుతుంది.

 

 కొసమెరుపు

ఇప్పుడు అమరావతి కోసం ప్రభుత్వం రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్‌డీఏ) ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇకనుంచి ఏ ఒప్పందం చేసుకున్నా సీఆర్‌డీఏకు ఆయా కంపెనీలకు మధ్యే జరగాలి. ఇది కేబినేట్ నిర్ణయం. ఇంతకు సీఆర్‌డీఏ చైర్మన్ ఎవరంటే... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.



 (కె.సుధాకర్‌రెడ్డి)

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top