మూడేళ్లయినా మొదలు కాని పనులు


ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఎదుట స్థానికుల ఆవేదన



బిట్రగుంట : బోగోలు మండలం కోవూరుపల్లి అంబేడ్కర్‌కాలనీలో మూడేళ్ల క్రితం మౌలిక వసతుల కల్పన కోసం అప్పటి టీడీపీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు శిలాపలకం ఏర్పాటు చేసినా నేటికీ ఒక్క పని కూడా ప్రారంభించలేదంటూ కోవూరుపల్లి అంబేడ్కర్‌కాలనీ వాసులు ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డికి ఎదుట వాపోయారు. శుక్రవారం కోవూరుపల్లి అంబేడ్కర్‌కాలనీలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు, యువత ఎమ్మెల్యేని శిలాపలకం వద్దకు తీసుకువెళ్లారు. 2014లో ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యే మస్తాన్‌రావు హడావుడిగా శిలాపలకం ఏర్పాటు చేశారని, పది రోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పి మూడేళ్లు గడిచినా ఒక్కపని కూడా ప్రారంభించలేదని అన్నారు.



కాలనీలో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, మురుగునీరు రోడ్లపైకి చేరుతుందని, తాగునీరు, వీధి దీపాలు లేక అవస్థలు పడుతున్నామని వాపోయారు. స్థానిక సామాజిక వనరుల భవనం కూడా శిథిలావస్థకు చేరుకుందని, కొత్త భవనం మంజూరు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. స్పందించిన ఎమ్మెల్యే తహసీల్దార్‌ కృష్ణారావుతో ఫోన్‌లో చర్చించి తాగునీటి సమస్యను వివరించారు. ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. కాలనీలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ఫ్లాన్‌ నిధుల రూ.94 లక్షల అంచనాతో సీసీ రోడ్లు, డ్రెయిన్‌ల నిర్మాణానికి శిలాపలకం వేశారు. పనులకు సంబంధించిన నిధులు ఏమయ్యాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top