పథకం ప్రకారమే?

పథకం ప్రకారమే? - Sakshi


కఠారి దంపతుల హత్య నుంచి చింటూ లొంగుబాటు వరకు..

వ్యవహారాన్ని  నడిపించిందెవరు..?


 

చిత్తూరు మేయర్ దంపతుల హత్యకేసు సోమవారం కీలక మలుపు తిరిగింది. ప్రధాన నిందితుడు చింటూ చిత్తూరు కోర్టులో లొంగిపోయాడు. ఈ నేపథ్యంలో మొత్తం 11 మంది నిందితుల్లో చింటూ కారు డ్రైవర్ తప్ప మిగిలిన వారందరూ అరెస్టు అయ్యారు. ఇదిలా ఉండగా.. ఈ కేసు వ్యవహారం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది.

 

చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ కఠారి అనురాధ దంపతులను హత్య చేయడం నుంచి చింటూ లొంగుబాటు వరకు అంతా పథకం ప్రకారమే జరిగి నట్లు తెలుస్తోంది. ఈ నెల 17న చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ కార్పొరేషన్ కార్యాలయంలో తుపాకీ గుళ్లు, కత్తిపోట్లకు బలయ్యారు. ఈ హత్యను తామే చేశామంటూ వెంకటాచలపతి, మంజునాథ్ వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు. మరో వ్యక్తి జయప్రకాష్‌ను పోలీసులు అరెస్టు చేశారు.



18వ తేదీన ఈ కేసులో ప్రధాన నిందితుడు కఠారి మోహన్ మేనల్లుడు చింటూనేనని పోలీసులు తేల్చారు. సీఎం చంద్రబాబుతో సహా పలువురు మంత్రులు హత్యను ఖండిస్తూ, నిందితుడిని పట్టుకుంటామని చెప్పారు. 19న మేయర్ దంపతుల అంత్యక్రియలు నిర్వహించారు. 20వ తేదీన రాష్ట్ర శాంతిభద్రతల అదనపు డీజీపీ ఠాకూర్ చిత్తూరుకు చేరుకున్నారు. చింటూను పట్టుకోవడానికి పది బృందాలను ఏర్పాటు చేశామని, అతని ఆచూకీ చెబితే రూ.లక్ష రివార్డు ఇస్తామని ప్రకటించారు.



24న మేయర్ హత్య కేసులో లొంగిపోయిన వెంకటాచలపతి, మంజునాథ్, జయప్రకాష్ అరెస్టు. 25న ఈ కేసులో యోగ, శశిధర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 27న రాష్ట్ర సీఐడీ అదనపు డీజీపీ ద్వారక తిరుమలరావు చిత్తూరు చేరుకుని కేసుపై సమీక్షించారు. ఇదే రోజు చింటూ తనకు ఈ కేసుతో సంబంధం లేదంటూ లేఖ రాశాడు. 28న రాష్ట్ర డీజీపీ రాముడు చిత్తూరు చేరుకుని కేసును సమీక్షించారు. చింటూ కోసం మొత్తం గాలిస్తున్నామని, అతన్ని త్వరలోనే పట్టుకుంటామన్నారు. చింటూ రాసిన ఉత్తరం చూస్తే ఇతను కోర్టులో లొంగిపోయే అవకాశం ఉందని చెప్పారు.



30వ తేదీ ఉదయం 11.05 గంటలకు పోలీసు అతిథి గృహంలో ఎస్పీ ప్రెస్‌మీట్ ప్రారంభించారు. కేసులో మురుగ, పరంధామ, హరిదాస్ అరెస్టు  చూపించారు. హత్యలో వారి పాత్రను వివరించారు. చింటూ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 11.33 గంటలకు ప్రెస్‌మీట్ పూర్తయ్యింది. అదేరోజు ఉదయం 11.37 గంటల ప్రాంతంలో చిత్తూరు న్యాయస్థానాల సముదాయంలోకి ఓ ఆల్టో కారు వచ్చి ఆగింది. అందులోంచి దిగిన ఓ వ్యక్తి గొడుగు వేసుకుని, చేతిలో రెండు పేపర్లు ఉంచుకుని నాలుగో అదనపు న్యాయస్థానంలోకి ప్రవేశిస్తూ గొడుగు తీసేశాడు. అక్కడున్న వారంతా ఒక్కసారిగా అతన్ని ఆశ్చర్యంగా చూశారు. వచ్చిన వ్యక్తి చింటూ. తనకు ఈ కేసులో సంబంధం లేదని పిటిషన్‌ను న్యాయమూర్తికి అందించాడు.



చింటూ న్యాయస్థానంలోనే దాదాపు మధ్యాహ్నం ఒంటిగంట వరకు కూర్చున్నాడు. ఇప్పటికే చింటూపై పోలీసులు కేసు నమోదు చేసి ఉండడం, చింటూను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ వేయడంతో న్యాయమూర్తి 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి, 15 రోజులు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం అతన్ని అత్యంత భద్రత నడుమ కడప జైలుకు తరలించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ను చింటూ వెనుకవైపు ఉన్న వ్యక్తులు పక్కా ప్రణాళికతో నడిపించారు. చింటూతో పాటు అతని డ్రైవర్ వెంకటేష్ కూడా లొంగిపోతే ఇద్దరికీ కేసులో సంబంధం ఉన్నట్లు తెలిసిపోతుందని గ్రహించిన చింటూ తాను ఒక్కడే లొంగిపోయినట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు.

 

దొరకాల్సింది ఒక్కడే

మేయర్ హత్య కేసులో ఇప్పటి వరకు పోలీసులు 11 మందిపై ప్రాథమికంగా కేసులు నమోదు చేశారు. ఇందులో తొలుత ఇద్దరు నిందితులు లొంగిపోగా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ప్రధాన నిందితుడు చింటూ న్యాయస్థానంలో లొంగిపోయాడు. ఇక ఈ కేసులో మరో నిందితుడు మొగిలి పోలీసుల అదుపులో ఉండగా, చింటూ డ్రైవర్ వెంకటేష్ ఒక్కడే దొరకాల్సి ఉంది. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా చింటూ లొంగుబాటు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ జనాలు గుమిగూడినా ఈ విషయం చుట్టూనే చర్చలు సాగాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top