త్రుటిలో తప్పిన ప్రమాదం

త్రుటిలో తప్పిన ప్రమాదం


 కడప అర్బన్‌ : ఏపీఎస్‌ ఆర్టీసీ కడప రీజియన్‌ పరిధిలోని కడప డిపోకు చెందిన కడప–చెన్నై ఆర్టీసీ బస్సు చిత్తూరు జిల్లా కరకంబాడి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఓ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొంది. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. దీంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు పూర్తిగా దెబ్బతినింది. కాంట్రాక్టు డ్రైవర్‌గా వెళ్లిన రవి నాయక్‌ తీవ్రంగా గాయపడ్డాడు. కొంత మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

యాజమాన్య నిర్లక్ష్యంతోనే:

యాజమాన్య నిర్లక్ష్య వైఖరి వల్లనే ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఎంప్లాయీస్‌ యూనియన్‌ జోనల్‌ అధ్యక్షుడు కేకే కుమార్‌ ఆరోపించారు. కాంట్రాక్టు డ్రైవర్లను దూర ప్రాంతాలకు పంపించకూడదనే సర్క్యులర్‌ ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే ఎవరైనా డిపో మేనేజర్లు కాంట్రాక్టు డ్రైవర్లతో దూర ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడిపితే.. ఆయా అధికారులపై చర్యలు తీసుకునేలా నిబంధన ఉందన్నారు.

డీఎం వివరణ

ఈ విషయంపై కడప డిపో మేనేజర్‌ ఆదినారాయణను ‘సాక్షి’ వివరణ కోరగా... కడప–చెన్నై బస్సుకు వెళ్లిన డ్రైవర్‌ రవినాయక్‌ను కాంట్రాక్టు నుంచి ఇటీవల రెగ్యులర్‌ చేశామని తెలిపారు. అయితే ఇంకా రెగ్యులర్‌ చేయలేదని కార్మిక సంఘం నాయకులు పేర్కొన్నారు.





 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top