ముడుపులకు మూల్యం

ముడుపులకు మూల్యం


ముడుపులకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్రతి బిల్లుకు డబ్బులు వసూలు చేస్తున్నందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. పర్సెంటేజీల పేరిట వేధింపులకు తగిన శాస్తి జరిగింది. ప్రజోపయోగానికి రోడ్డు నిర్మించేందుకు లంచాలు చెల్లించాలి. ఆ పని దక్కించుకోవడానికి పర్సంటేజీలు ఇవ్వాలి. ఇక పని పూర్తి చేశాక ఆ కాంట్రాక్టర్‌కు దక్కిందేమిటి. కడుపు మండిన ఓ కాంట్రాక్టర్‌ వేధిస్తున్న ఇంజినీరింగ్‌ అధికారిని అవినీతి నిరోధక శాఖకు పట్టించారు.  



ఏసీబీకి చిక్కిన ఇంజినీరింగ్‌ అధికారి

ఎంబుక్‌లో నమోదు చేసేందుకు రూ. 20వేలు డిమాండ్‌

కడుపుమండి ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్‌




సాక్షి ప్రతినిధి, విజయనగరం :పర్సంటేజీలు, ముడుపులు ఇచ్చుకోలేక చిన్నపాటి కాంట్రాక్టర్లు చితికిపోతున్నారు. సహనం ఉన్న వాళ్లు భరిస్తున్నారు. తట్టుకోలేని వాళ్లు అవినీతికి పాల్పడుతున్న వారికి తిరిగి బుద్ధి చెబుతున్నారు. ఇప్పుడా విధంగానే సాలూరు మండల ఇంజినీరింగ్‌ అధికారి రాంగోపాల్‌ రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. ఎంబుక్‌లో రికార్డు చేసేందుకు చిన్నపాటి కాంట్రాక్టర్‌ నుంచి రూ. 20వేలు లంచం తీసుకుని విజయనగరం కలెక్టరేట్‌ ప్రధాన గేటు వద్ద పబ్లిక్‌గా దొరికిపోయారు.



పని చేతికొచ్చిన దగ్గరి నుంచే ముడుపులే

పనులు మంజూరైన దగ్గరి నుంచి చేపట్టిన వరకు అడ్డుగోలు కార్యక్రమమే. నామినేటేడ్‌ పద్ధతిలో మంజూరైన పనులను సంబంధిత సర్పంచ్‌లు, నీటి సంఘాల అధ్యక్షులు చేపట్టాల్సి ఉంది. కొందరు అధికార పార్టీ నేతలు కష్టపడకుండానే సొమ్ము చేసుకోవాలన్న అత్యాశతో మంజూరైన పనులను పర్సంటేజీకి చిన్నపాటి కాంట్రాక్టర్లకు అమ్మేస్తున్నారు. నాలుగు డబ్బులొస్తాయని ఆశపడి కాంట్రాక్టర్లు ఏదో ఒక రకంగా పని కానిచ్చేస్తున్నారు.



ఇంజినీరింగ్‌ అధికారులకు మామూళ్లు

ఇక సర్పంచ్‌లనుంచి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లను ఇంజినీరింగ్‌ అధికారులు వదలడంలేదు. తమకు రావల్సినవి ఇచ్చేయాల్సేందంటూ పర్సంటేజీలు తీసుకుంటున్నారు. కొందరు పని విలువలో 10నుంచి 12శాతం తీసుకుంటుండగా, మరికొందరు 15శాతం వరకు గుంజేస్తున్నారు. ఇరిగేషన్‌ పనుల్లోనైతే 20శాతం వరకు లాగేస్తున్నారు. ఇంజినీరింగ్‌ అధికారులు వాటితో సంతృప్తి చెందడం లేదు. ఎంబుక్‌లో రికార్డు చేసిన ప్రతీసారి పిండేస్తున్నారు. అప్పుడు కూడా తమను సంతృప్తి పరచాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పుడా రకంగా ఇవ్వలేకే సాలూరు మండలం పురోహితునివలసకు చెందిన కాంట్రాక్టర్‌ బి.సూర్యనారాయణ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వ్యూహాత్మకంగా ఎంబుక్‌ రికార్డు చేసేందుకు డబ్బులు అడిగిన మండల ఇంజినీరింగ్‌ అధికారి రాంగోపాల్‌రెడ్డిని బుక్‌ చేయించారు.



పట్టు బడేంతవరకు తొందరే

బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ రాంగోపాల్‌రెడ్డి వ్యవహారం చూస్తే లంచం సొమ్ము కోసం తానెంత ఆత్రుత పడ్డాడన్నది స్పష్టమవుతుంది. రూ. 5లక్షల విలువైన సీసీ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే రూ. 3.50లక్షల బిల్లు చేసేశారు. మిగతా రూ. లక్షా 50వేలు బిల్లు కోసం రూ. 20వేలు డిమాండ్‌ చేశారు. లంచమిస్తేనే ఎంబుక్‌ రికార్డు చేస్తానని మొండికేయడంతో కాంట్రాక్టర్‌ సూర్యనారాయణ మంగళవారం రాత్రి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి ప్రణాళిక ప్రకారం అడిగినంత ఇస్తామంటూ ఇంజినీరింగ్‌ అధికారికి చెప్పించారు. బుధవారం తెల్లవారు జామునుంచి లంచం సొమ్ము కోసం ఇంజినీరింగ్‌ అధికారి తెగ ఆరాట పడ్డారు. ఉదయం 7.30గంటలకు కాంట్రాక్టర్‌కు ఫోన్‌ చేసి సాలూరు రావడం లేదని... కలెక్టరేట్‌లో సమావేశం ఉందని... ఇక్కడికొచ్చి ఇవ్వాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. మళ్లీ 9గంటలకు ఫోన్‌ చేసి వస్తున్నావా...అని అడిగారు. 9.30గంటలకు మరోసారి ఎక్కడున్నావని అడిగారు. 10గంటలకు ఫోన్‌ చేసి కలెక్టరేట్‌ వద్దకు వచ్చేశానని, తెలిపారు. ఇదిగో వచ్చేస్తున్నానంటూ కాంట్రాక్టర్‌ సూర్యనారాయణ ఏసీబీ అధికారులను వెంటబెట్టుకుని కలెక్టరేట్‌ ప్రధాన గేటు వద్దకు వచ్చారు. ఆ పక్కనే చెట్లు కింద ఉన్న ఇంజినీరింగ్‌ అధికారిని కలిశారు. లంచం సొమ్మును ఇచ్చేందుకు ప్రయత్నించగా తన బ్యాగ్‌లో పెట్టాలని ఇంజనీరింగ్‌ అధికారి కోరారు. కానీ, కాంట్రాక్టర్‌ బ్యాగ్‌లో పెట్టకుండా నేరుగా చేతికిచ్చాడు. అదే అదనుగా మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు పబ్లిక్‌గా పట్టుకున్నారు. వెంటనే కారులోకి ఎక్కించి, విచారించారు. మీడియా కంట పడకుండా గంటన్నరకు పైగా కారులోనే ఇంజనీరింగ్‌ అధికారి ఉండిపోయారు. కొసమెరుపు ఏంటంటే ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఇంజినీరింగ్‌ అధికారికి మరో రెండేళ్లే సర్వీసు ఉంది. దాడుల్లో విజయనగరం ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి, సీఐలు రమేష్, లక్మోజులు  పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top