నకిలీ విత్తు.. పత్తి రైతు చిత్తు

నకిలీ విత్తు.. పత్తి రైతు చిత్తు - Sakshi


సాక్షి, రంగారెడ్డి జిల్లా : పత్తి రైతును ‘నకిలీ విత్తు’ చిత్తుచేసింది. ఆరుగాలం పడిన శ్రమను మట్టిలో కలిపేసింది. వర్షాధార పంటలపై ఆధారపడిన రంగారెడ్డి జిల్లా రైతాంగం గత ఖరీఫ్ సీజన్లో 55 వేల హెక్టార్లలో పత్తి పంట సాగుచేసింది. అయితే పలుచోట్ల నకిలీ విత్తనాలు కష్టజీవిని కుదిపేశాయి. పెరుగుదలలో జోరు చూపినా.. దిగుబడి సమయంలో మా త్రం రైతుకు చుక్కలు చూపించాయి. కీలక సమయంలో పూత, కాత రాక తీవ్ర నష్టాలనే మిగిల్చాయి. వికారాబాద్, నవాబ్‌పేట్, మర్పల్లి, మోమీన్‌పేట్ తదితర మండలాల్లోని పలువురు రైతులు నకిలీ విత్తనాలతో ఈసారి ఖరీఫ్ సీజన్‌లో భారీనష్టాలే మూటగట్టుకున్నా రు. ఒక్కోచోట ఒక్కో రకం విత్తనాలు వాడి సాగుచేసిన రైతులు చివరకు దిగుబడిని మాత్రం సాధించలేకపోయారు. దీంతో శ్రమ వృథా అయి ఆర్థికంగా చితికిపోయారు.



 నమ్మించి.. నట్టేటముంచి..

 ఈ ఏడాది మేలో మహికో కంపెనీకి చెందిన పలువురు ప్రతినిధులు వికారాబాద్ మండలం పాతూరు గ్రామంలో పర్యటించారు. పలువురు రైతులతో మాట్లాడి మహికో విత్తనాలు వేస్తే బ్రహ్మాండమైన దిగుబడి వస్తుందని ప్రచారం చేశారు. అదేవిధంగా స్థానిక నర్సింగ్ ఫంక్షన్‌హాలులో ఈ ప్రతినిధి బృందం రైతులతో సమావేశం ఏర్పాటు చేసి కొత్త పరిజ్ఞానంతో తయారు చేసిన మహికో విత్తనాలు వాడాలని, పరిమిత సంఖ్యలోనే విత్తన డబ్బాలు జిల్లాకు తీసుకొచ్చామని వివరించారు. కొరత వచ్చే అవకాశముందని మహికో ప్రతినిధులు తెలిపినట్లు స్థానిక రైతు డి.మల్లారెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. కంపెనీ ప్రతినిధుల మాట విని ఆగమేఘాలమీద విత్తనాలు కొనుగోలు చేసి  నష్టపోయినట్లు ఆ రైతు ఆవేదన వెళ్లగక్కాడు.



 ఫలించని ‘ప్రత్యామ్నాయం’

 తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటలు భారీ విస్తీర్ణంలో ఎండిపోయాయి. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పంటను దక్కిం చుకునే ప్రయత్నం చేశారు. అయితే నకిలీ విత్తనాలు రైతుల ప్రయత్నాన్ని విఫలం చేశాయి. వికారాబాద్ మండలం పులుసుమామిడి గ్రామానికి చెందిన రైతు కామిడి అనంతరెడ్డి రెండెకరాల్లో పత్తి  సాగుచేశాడు. వర్షాలు లేకపోవడంతో బోరుతో పంటకు నీరందిం చాడు. వాస్తవానికి 5 నెలల్లో పత్తి పంట దిగుబడి రావాల్సి ఉండగా.. ఆర్నెల్లు కావస్తున్నా కాత లేకపోవడంతో కంగుతిన్న అనంతరెడ్డి.. అధికారులను ఆశ్రయిం చాడు. విత్తనాల్లో తేడా ఉందని తెలియడంతో లబోదిబోమంటున్నా డు. రెండెకరాల్లో సాగుకు రూ.70 వేలు ఖర్చు చేసినట్లు అన ంతరెడ్డి ‘సాక్షి’కి వివరించాడు.



 ఆందోళనల పర్వం..

 పత్తి పంట దిగుబడి రాకపోవడంతో రైతుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వికారాబాద్ మండలం పాతూరుకు చెందిన  ు సోమవారం జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. విత్తనాల తీరును అధ్యయనం చేయాలని డిమాండ్ చేయడంతో శాస్త్రవేత్తలను పంపి పరిస్థితిని సమీక్షిస్తామని వ్యవసాయశాఖ సహాయ సం చాలకులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. మర్పల్లి మండలంలోని పలు గ్రామాల రైతులు కూడా స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో వ్యవసాయాధికారి నష్టపోయిన రైతుల వివరాలను జేడీఏకు పంపగా.. శాస్త్రవేత్తలను పంపిస్తామని చెప్పడం తో అక్కడ కూడా ఆందోళనకు బ్రేక్ పడింది. అయితే విత్తనాల తీరుపై శాస్త్రవేత్తల రిపోర్టు వచ్చాకే మరింత స్పష్టత రానుంది.



 రూ. 50 వేలు మట్టిలో కలిశాయి..

 ఎకరాకు రూ.10 వేల చొప్పున చెల్లించి రెండెకరాలు కౌలుకు తీసుకున్నా. పత్తి పంటసాగు కోసం దుక్కులు దున్ని, విత్తనాలు కొనుగోలు చేసి విత్తడం, మందులు చల్లడానికి రూ.30 వేలు ఖర్చు చేశా. కానీ ఏపుగా పెరిగిన పంట.. పూతతోనే సరిపెట్టింది. ఒక్కో మొక్కకు 4 కాయలే కాశాయి. దిగుబడి రాలేదం టూ అధికారుల చుట్టూ నెల రోజుల నుంచి తిరుగుతున్నా సహకరించడం లేదు. కౌలు డబ్బులు.. పెట్టుబడి డబ్బులు రెండూ మట్టిలో కలిశాయి. ఖరీప్ సీజన్‌తో రూ. 50 వేలు నష్టపోయా.         

     -పి.రాంచంద్రారెడ్డి, పత్తిరైతు, పాతూరు

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top