రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప భక్తుడు మృతి
ఆళ్లగడ్డ : కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారిపై ఆళ్లగడ్డ పట్టణ శివారులోని గూబగుండం మెట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప భక్తుడు దుర్మరణం చెందాడు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన వీరేష్ (38), మరికొందరు వారం క్రితం జీపులో శబరిమల వెళ్లారు. స్వామి దర్శనం అనంతరం స్వగ్రామానికి తిరిగి వస్తుండగా శనివారం ఉదయం ఆళ్లగడ్డ పట్టణం దాటిన తరువాత గూబగుండం మెట్ట సమీపంలో జీపు టైర్ పంక్చర్ అయింది. డ్రైవర్ టైర్ మారుస్తుండగా వీరేష్ సహాయం చేస్తున్నాడు. ఇంతలో ఆళ్లగడ్డ నుంచి నంద్యాల వైపు వెళ్తున్న డీసీం వాహనం ఆగి ఉన్న జీపును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వీరేష్ అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. రూరల్ పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.