కొడుకు చేతిలో తండ్రి, వదిన హతం
మహబూబ్నగర్ జిల్లాలో దారుణ ఘటన
దౌల్తాబాద్: వారసత్వంగా తనకు రావాల్సిన భూమిని ఇప్పుడే పంచివ్వాలంటూ తండ్రిపై కొడుకు ఒత్తిడి చేశాడు. కాదన్నందుకు సైకోగా మారి హతమార్చాడు.. అడ్డొచ్చిన వదినను సైతం వెంటాడి చంపేసి పారిపోయాడు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా దౌల్తాబాద్ మండలం చంద్రకల్లో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. చంద్రకల్ గ్రామానికి చెందిన ముంగిమళ్ల ఆశమ్మ, సాయప్ప దంపతులకు ఇద్దరు కుమారులుండగా పెళ్లిళ్లు కూడా అయ్యాయి. రెండో కుమారుడు అశోక్కు కొంతకాలంగా మతిస్థిమితం సరిగాలేదు. ఉన్న మూడెకరాల పొలంలో తన వాటా పంచివ్వాలని తరచూ తల్లిదండ్రులతో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి మరోసారి ఘర్షణ పడటమేగాక బండరాయితో మోదడంతో తండ్రి సాయప్ప (55) అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు.
అడ్డుకోబోయిన వదిన లక్ష్మి (26)ని సైతం అదే బండరాయితో మోది చంపేశాడు. అనంతరం సైకోగా ప్రవ ర్తిస్తూ రక్తపు మడుగులో ఉన్న తండ్రి మృతదేహాన్ని గ్రామ శివారులోని ఆలయం వద్దకు ఈడ్చుకెళ్లాడు. ‘మా నాన్నను బతికించాలి దేవుడా..’ అని గంటకొడుతూ ప్రాధేయపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చేలోగా నిందితుడు పారిపోయాడు.