కూలిందా..? పేలిందా..?

రోదిస్తున్న సందీప్‌ బంధువులు - Sakshi


తిప్పాపూర్‌ మృతులంతా స్థానికేతరులే

ఏడు ప్రాణాలు పోయినా ఏడుపే లేదు

సొరంగంలో చిక్కి ముక్కలైన శరీరాలు

అంతా గోప్యం.. రక్షణ శూన్యం

సబ్‌ కాంట్రాక్టుల చేతిలో పనులు

నీటిపారుదల శాఖ అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం




సిరిసిల్ల/ఇల్లంతకుంట :  బతుకుదెరువు వెతుక్కుంటూ పొట్టచేత పట్టుకుని వచ్చిన కూలీ బతుకుకూలిపోయింది. ఏడు నిండు ప్రాణాలు పోయినా.. ఏడ్చేందుకు ఒక్కరైనా లేని దయనీయం. మృతులంతా 35 ఏళ్లలోపు యువకులే. నా అనేవారే లేని గుట్టల మధ్య కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రాణాలను ఎత్తిపోశారు. శవాలను బట్టల్లో చుట్టి అంబులెన్స్‌లో కరీంనగర్‌కు తరలించారు. అయినవారు ఎవరూ లేక ఏడ్చేవారు లేకపోవడం బాధాకరం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్‌ వద్ద సాగుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–10లో బుధవారం ఏడుగురు కూలీలు బలయ్యారు. ఒక్కసారిగా కూలిన బండరాళ్లతో కూలీల శరీర భాగాలు ముక్కలయ్యాయి. ఏం జరిగిందో ఊహించేలోపే ఏడు ప్రాణాలు గాలిలో కలిసిన ఘటన విషాదాన్ని నింపింది.



 సొరంగం మృత్యుకుహరం..

మధ్యమానేరు జలాశయం నుంచి మల్లన్నసాగర్‌కు సాగునీటిని పంపింగ్‌ చేసే సొరంగం పనులు మృత్యుకుహారంగా మారింది. బుధవారం ఎప్పటిలాగే పనుల్లోకి వెళ్లిన 27 మందిలో భూపాలపల్లి జిల్లా ములుగుకు చెందిన ఎలక్ట్రిషియన్‌ సందీప్‌(25), జార్ఖండ్‌కు చెందిన గౌట్మా(24), హకీం(26), బీహార్‌కు చెందిన పురమ్‌సింగ్‌(32), జిలిటెన్స్‌ బ్లాస్టర్‌ జితేందర్‌(25), ఒడిశాకు చెందిన సూపర్‌వైజర్‌ హరి(35), ఛత్తీస్‌గఢ్‌కు చెందిన హరిరామ్‌ (35) మృతిచెందారు. బీహార్‌కు చెందిన గోధన్‌ (30) చికిత్స పొందుతున్నాడు. సొరంగంలో పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా.. ఈ ఘటన జరిగింది.



సొరంగంలో పనులు ముగింపుదశకు చేరాయని, బుధవారం గడిస్తే.. మళ్లీ యంత్రాలతోనే పనులు చేసేది ఉందని నీటిపారుదలశాఖ ఈఈ ఆనంద్‌ తెలిపారు. నీటి పంపింగ్‌ మోటార్లు బిగింపు పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. సొరంగమార్గం భూఉపరితలం నుంచి 150 మీటర్ల లోతులో.. మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. రెండు కిలోమీటర్ల జంక్షన్‌ వద్దనే ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సొరంగం చీకటితో నిండి మసక మసక వెలుతురు ఉంది. ఉబికివచ్చే నీటి ఊటలను దాటుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుందని సొరంగంలో పనిచేసిన కూలీలు వివరించారు. ఆక్సిజన్‌ లభించక ఇబ్బందులు పడిన సందర్భాలు అనేకమున్నాయని తెలిపారు. దినదినగండంగా.. నిత్యప్రమాదాల మధ్య పనిచేసినట్లు కూలీలు తెలిపారు. అనూహ్యంగా ఏడుగురు బలి కావడంతో ఆ సొరంగాన్ని చూస్తేనే భయమేస్తోందని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్మికుడు ఒకరు చెప్పారు.



మృతులంతా యువకులే..

సొరంగంలో మరణించిన వారంతా 35 ఏళ్లలోపు యువకులు కావడం మరో విషాదం. ఇందులో చాలామందికి పెళ్లికూడా కాలేదు. జార్ఖండ్‌కు చెందిన గౌట్మా(24) మూడు నెలల కిందట తిప్పాపూర్‌ సైట్‌కు పనికి వచ్చాడని అతని సోదరుడు దేవినీస్‌ తెలిపారు. డ్రిల్లింగ్‌ పనిచేసే గౌట్మాకు ఇంకా పెళ్లికాలేదు. ఇలా ఏడుగురు మృతుల్లో చాలామందికి వివాహం కాలేదు. కుటుంబపోషణ కోసం వచ్చి బలికావడం బాధాకరం. తిప్పాపూర్‌ సొరంగం పనులు చేసే కార్మికులకు నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పనిని బట్టి కాంట్రాక్టర్‌ చెల్లిస్తారని సమాచారం. ప్రమాదకరమైన పని కావడంతో స్థానికులు ఎవరూ ఈ పని చేయరనే భావంతో కాంట్రాక్టర్లు పొరుగు రాష్ట్రాల కూలీలను తెచ్చారు. కనీస మౌలిక వసతులు లేకున్నా..రేకుల శిబిరంలో తలదాచుకుంటూ.. అక్కడే తింటూ.. అక్కడే పనిచేస్తూ.. కాలం వెల్లదీయడం కూలీల పని. ఈ క్రమంలో విధి ఇలా కాటేయడంతో విగతజీవులగా వారివారి స్వస్థలాలకు చేరుకోవాల్సి రావడం విషాదం.



సబ్‌ కాంట్రాక్టర్‌ చేతిలో పనులు..

కాళేశ్వరం ప్యాకేజీ–10ను హెచ్‌సీసీ అనే సంస్థ కాంట్రాక్టు పొందగా.. ప్రతిమ ఇన్‌ఫ్రా అనే సబ్‌ కాంట్రాక్టు సంస్థ పనులు చేస్తోంది. క్షేత్రస్థాయిలో సబ్‌ కాంట్రాక్టు సంస్థ సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందనే అనుమానాలున్నాయి. సంఘటన సమాచారాన్ని ఎందుకు సకాలంలో అందించలేదని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ నీటిపారుదలశాఖ ఈఈ ఆనంద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు డీఐజీ రవివర్మ, ఎస్పీ విశ్వజిత్‌ సొరంగంలోకి వెళ్లి వచ్చారు. గుట్టల వద్ద ఏడుగురు మరణించారని తెలియడంతో తిప్పాపూర్‌ వాసులు సొరంగం వద్దకు తరలివచ్చారు. ఘటనా స్థలానికి సిరిసిల్ల ఆర్డీవో ఎన్‌.పాండురంగ, తహసీల్దార్‌ శ్రీనివాస్, ఇల్లంతకుంట ఎంపీపీ గుడిసె  అయిలయ్య, ‘సెస్‌’ డైరెక్టర్‌ వెంకటరమణారెడ్డి, సిరిసిల్ల రూరల్‌ సీఐ అనిల్‌కుమార్, ఎస్సైలు లక్ష్మారెడ్డి, ప్రవీణ్, వెంకటకృష్ణ, నరేశ్‌కుమార్, సురేందర్‌రెడ్డి వచ్చారు.



సాయుధ పోలీసుల పికెటింగ్‌

ఘటనా స్థలంలో సాయుధ పోలీసుల పికెటింగ్‌ను ఏర్పాటు చేశారు. డిస్ట్రిక్ట్‌గార్డ్స్‌ పోలీసులతో పాటు ఇల్లంతకుంట పోలీస్‌స్టేషన్‌కు చెందిన సాయుధ పోలీసులను రక్షణగా ఉంచారు. శవాలను షిఫ్ట్‌ చేసిన అనంతరం సొరంగంలోకి ఎవరినీ అనుమతించకుండా కట్టడి చేశారు. స్థానికులు చూసేందుకు వచ్చినా వారిని అక్కడి నుంచి పంపించారు.



అంతా గోప్యం.. రక్షణ శూన్యం..

సొరంగం తవ్వే క్రమంలో సింగరేణి తరహాలో రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రాక్‌ మెకానిజం (ఎన్‌ఐఆర్‌ఎం) పర్యవేక్షణలో పనులు చేయాల్సి ఉంది. కానీ రక్షణ చర్యలు తీసుకోకుండా సొరంగం తవ్వకాలు సాగించడంతో ఈ ప్రమాదం జరిగిందనే అనుమానాలున్నాయి. సొరంగం తవ్వేందుకు మిషన్‌ బూమర్‌ ఉండగా.. బండలను పేల్చేందుకు జిలిటెన్లు వినియోగిస్తారు. జిలిటెన్‌ పేలినప్పుడు భారీ శబ్దం రావడంతో భూమి కంపించి పైకప్పు కూలిందా..? లేక రాతిపొరల్లోకి గాలి చేరడంతో ప్రమాదవశాత్తు పడిపోయిందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



సంఘటన జరిగిన తరువాత పోలీసు అధికారులు చేరుకుని శవాలను బట్టల్లో చుట్టి తరలించారు. రెవెన్యూ, ఇతర శాఖల అధికారులను ఎవరినీ సొరంగంలోకి అనుమతించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రమాద ఘటనపై అంతా గోప్యంగానే ఉంచారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రమాదం జరిగిందని చెబుతున్న అధికారులు.. సాయంత్రంవరకూ ఎందుకు బయటపెట్టలేదో అంతుచిక్కడం లేదు. రెవెన్యూ అధికారులకు సైతం సాయంత్రంవరకూ సమాచారం లేకపోవడం గమనార్హం. కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ సిరిసిల్ల నుంచి బయల్దేరగా.. దారి తప్పిపోయి అరగంట ఆలస్యంగా తిప్పాపూర్‌ సొరంగం వద్దకు చేరారు. మొత్తంగా ఏడుగురిని బలి తీసుకున్న ఘటనపై పొంతన లేని కథనాలు పలు అనుమానాలకు తావిస్తోంది.



మృతులు వీరే..

ప్రమాదంలో మృతిచెందినవారిలో జార్ఖండ్‌ రాష్ట్రం తూర్పుసింగ్‌భమ్‌ జిల్లా జందా గ్రామానికి చెందిన హికిమ్‌ హండ్సా (26), సిందేగా జిల్లా రాంజోల్‌ గ్రామానికి చెందిన గాట్మాటోప్నో, ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బగ్‌బన్‌పూర్‌కు చెందిన రామకష్ణన్‌ సాహు(35), ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్‌ జిల్లా సౌత్‌పూర్‌కు చెందిన హరిచంద్‌ నేతన్‌(35), పశ్చిమ్‌బంగ రాష్ట్రం బురద్ద్వాన్‌ జిల్లాకు చెందిన జితేందర్‌కుమార్‌(25), జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ములుగుకు చెందిన యాసం సందీప్‌ (25), జార్ఖండ్‌ రాష్ట్రం రాంగడ్‌ జిల్లా బర్ఖాంగ గ్రామానికి చెందిన పూరన్‌సింగ్‌(40) ఉన్నారు. జార్ఖండ్‌ జిల్లా ముస్బాని గ్రామానికి చెందిన బుడాన్‌ సోరెన్‌ (38)కు కరీంనగర్‌ ప్రతిమ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top