విహారయాత్రలో విషాదం
సాక్షి, వనపర్తి: విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. శబరిమల యాత్రకు వెళ్లిన ఐదుగురు స్నేహితులు.. తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యా రు. ఈ ఘటన శనివారం వనపర్తి జిల్లా కొత్త కోట మండలం అమడబాకుల వద్ద జరిగిం ది. అడ్డాకుల మండలం రాచాలకు చెందిన నాగరాజు(35), ఆంజనేయులు(30), అదే మండలం గుడిబండకు చెందిన జనార్దన్(30), శేఖర్, కర్నూల్ జిల్లాకు చెందిన రాఘవేందర్(27), నాగర్కర్నూల్కు చెందిన వెంకటయ్య(37) ప్రాణస్నేహితులు. భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్న వీరంతా హైదరాబాద్లోని బీఎన్రెడ్డినగర్లో నివాసం ఉంటున్నారు. ప్రతి ఏటా వారం పాటు స్నేహితులందరూ కలసి విహారయాత్రకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న నాగరాజుకు చెందిన(ఏపీ 24 ఏజే 5111) నంబర్గల స్కార్పియోలో శబరిమల యాత్రకు వెళ్లారు.
శుక్రవారం తిరుపతి వేంకటేశ్వరుడిని దర్శించుకుని అర్ధరాత్రి ఇంటికి తిరుగు ప్రయాణ మయ్యారు. జాతీయ రహదారిపై ఉన్న అమడబాకుల స్జేజీ వద్దకు రాగానే ఓ వ్యక్తి తన బైకును యూటర్న్ తీసుకోవడానికి బ్రేక్ వేశాడు. ఇదే సమయంలో వెనుక నుంచి అతి వేగంగా వస్తున్న స్కార్పియో డ్రైవర్ నాగరాజు వాహనాన్ని అదుపు చేయలేక పోయాడు. దీంతో స్కార్పియో నాలుగు పల్టీలు కొట్టింది. ఈ దుర్ఘటనలో నాగరాజు, ఆంజనేయులు, జనార్దన్, రాఘవేందర్ తలలు పగిలి ఘటనాస్థలంలోనే ప్రాణాలు వదిలారు. తీవ్రంగా గాయపడిన వెంకటయ్యను స్థానికులు వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించగా.. వైద్యం చేయిస్తుండగా అతను చనిపోయాడు. వాహనంలో ఉన్న శేఖర్ సీట్ల మధ్యలో ఇరుక్కుని స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు.