అత్యాధునికంగా 36 రైల్వే స్టేషన్ల అభివృద్ధి..

అత్యాధునికంగా 36 రైల్వే స్టేషన్ల అభివృద్ధి..


సాక్షి, హైదరాబాద్‌: అత్యాధునిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విమానాశ్రయాల తరహాలో దేశవ్యాప్తంగా 400 రైల్వేస్టేషన్ల పునర్నిర్మాణంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వేలో 36 స్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌యాదవ్‌ తెలిపారు. మొదటి దశలో చేపట్టనున్న సికింద్రాబాద్, విజయవాడ రైల్వేస్టేషన్ల రీడెవలప్‌మెంట్‌ విధివిధానాలను ఆయన గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ రెండు స్టేషన్లకు మే 24లోగా గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానిస్తున్నామన్నారు. మొదట ఆయా సంస్థల సాంకేతిక, ఆర్థికసామర్థ్యాలను అనుసరించి డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టును కోరతామని చెప్పారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో రూ.282 కోట్లు, విజయవాడ స్టేషన్‌లో రూ.194 కోట్ల మేర ప్రయాణ సదుపాయాలను ఏర్పాటు చేస్తామన్నారు.



ఇందుకోసం సికింద్రాబాద్‌కు ఆనుకుని ఉన్న 5.6 ఎకరాల స్థలాన్ని, విజయవాడ స్టేషన్‌కు ఆనుకుని ఉన్న 7.87 ఎకరాలను ప్రైవేట్‌ సంస్థల వాణిజ్య కార్యకలాపాల కోసం 45 ఏళ్ల పాటు లీజుకు ఇస్తామని తెలిపారు. ప్లాట్‌ఫామ్‌ల ఆధునీకరణ, అదనపు ప్లాట్‌ఫామ్‌ల ఏర్పాటు, స్టేషన్‌ సుందరీకరణ, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు, మల్టీలెవల్‌ పార్కింగ్, ప్రత్యేక ర్యాంప్‌లు, విశ్రాంతి గదులు, కేటరింగ్, పరిశుభ్రమైన తాగునీరు, ఏటీఎంలు, ఫార్మా, పటిష్టమైన భద్రతా వ్యవస్థ, అన్ని ప్లాట్‌ఫామ్‌లకు ఎస్కలేటర్లు, లిఫ్టులు వంటి అత్యాధునిక ప్రయాణ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.



 ఇందుకోసం రైల్వేశాఖ సొంతంగా ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండా స్థలాలను ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెట్టడం ద్వారా సదుపాయాలను కల్పిస్తుందని వివరించారు. రెండో దశలో దక్షిణ మధ్య రైల్వేలోని మరో 12 ప్రధాన రైల్వేస్టేషన్ల పునర్నిర్మాణానికి వచ్చే జూన్‌లో, మూడో దశలో 22 స్టేషన్లకు డిసెంబర్‌లో టెండర్‌లను ఆహ్వానిస్తామన్నా రు. ఇండియా చాలెంజ్‌ పద్ధతిలో గ్లోబల్‌ టెండర్లకు రైల్వేశాఖ శ్రీకారం చుట్టిందన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top