పేకాట ఆడుతున్న 30 మంది అరెస్టు


కడప క్రైం: కడప వన్‌ టౌన్‌ పోలీస్టేషన్‌ పరిధిలోని ఆఫీసర్స్‌ క్లబ్‌పై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి  పొద్దుపోయాక కడప డీఎస్పీ అశోక్‌కుమార్‌ ఆదేశాల మేరకు వన్‌ టౌన్‌ సీఐ టీవీ సత్యనారాయణ, ఎసైలు నాగరాజు, రాజేశ్వరరెడ్డి, అమరనాధరెడ్డి, కుల్లాయప్ప, సిబ్బంది దాడి చేశారు. అరెస్టు అయిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు ఉన్నారని అధికారులు తెలిపారు.



ఈ సంఘటన పై వన్‌టౌన్‌ సీఐ టీవీ సత్యనారాయణ మాట్లాడుతూ.. తమకు వచ్చిన సమాచారం మేరకు ఆఫీసర్స్‌ క్లబ్‌పై దాడి చేశామని, ఇందులో 30 మంది పేకాడుతుండగా పట్టుకుని అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.51,830 నగదు, పేక ముక్కలు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఆఫీసర్స్‌ క్లబ్‌ నిర్వహకులు మాత్రం తమకు హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని ఆ మేరకే రిక్రియేషన్‌ కోసం 13 ముక్కల ఆటను ఆడుకుంటున్నామని తెలిపారు. పోలీసులు సీసీ కెమెరాల పుటేజీ హార్డ్‌ డిస్కలను సీజ్‌ చేశారు. ఈ సమయంలో క్లబ్‌ సభ్యులైన టీడీపీ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, హరిప్రసాద్‌ పోలీసులతో చర్చించేందుకు అక్కడికి వచ్చారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top