3,667 మంది అర్హత
మహబూబ్నగర్ క్రైం: కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం 800 మీటర్ల పరుగులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మంగళవారం ఉదయం ఛాతీ, ఎత్తు, బరువు చూడటంతో తదితర ఈవెంట్స్ను నిర్వహించారు. మొత్తం 1541మంది అభ్యర్థులు హాజరుకాగా, 903మంది ఇతర నాలుగు రకాల దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు.
ఇప్పటివరకు మొత్తం కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు 3,667మంది అర్హత సాధిస్తే, అందులో పురుషులు 2,955, అమ్మాయిలు 712మంది అభ్యర్థులున్నారు. అయితే మంగళవారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అభ్యర్థులు అవస్థలు పడ్డారు. ముఖ్యంగా 800మీటర్ల పరుగులో మైదానం చుట్టూ రెండు రౌండ్స్ పరుగెత్తాల్సిన క్రమంలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది మధ్యలోనే విరమించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండతో పాటు ఉక్కపోతతో కూడిన వేడి ఉండటంతో అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలలో విజయం సాధించడానికి చాలా కష్టపడ్డారు. ఎస్పీ రెమా రాజేశ్వరి, ఇతర పోలీసు అధికారులు పర్యవేక్షించారు.