ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సవ కోలాహలం


ప్రారంభం కానున్న 13 రాష్ట్ర కార్యాలయాలు

మంత్రుల చేతులమీదుగా ప్రారంభోత్సవాలు

తరలిరానున్న అధికారులు




విజయవాడ : విజయవాడ నగరంలో, శివారు ప్రాంతాల్లో సోమవారం 13 రాష్ట్ర కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 8 విభాగాలకు సంబంధించిన ఈ కార్యాలయాలను ఆయా శాఖల మంత్రుల చేతులమీదుగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నుంచి ఉద్యోగులు, అధికారులు తమ సామగ్రితో విజయవాడకు తరలివస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సవాలను ఆర్భాటంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో విజయవాడ నగరం సందడిగా మారనుంది. ప్రారంభం కానున్న కార్యాలయాల వివరాలివీ...


 

పంచాయతీరాజ్ కమిషనర్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయాన్ని విజయవాడ నక్కల్ రోడ్డులోని చరితశ్రీ హాస్పిటల్ భవనంలో ఆ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తారు. రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ డెరైక్టరేట్ కార్యాలయాన్ని మారుతీనగర్‌లోని జీపీఆర్ స్ట్రీట్‌లో గల వి.ప్లాజాలో ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తారు.పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ చీఫ్ కార్యాలయాన్ని బందరు రోడ్డులో పీడబ్ల్యూడీ గ్రౌండ్ ఎదురుగా గల జెడ్పీ కార్యాలయంలో ఆ శాఖ మంత్రి సీెహ చ్ అయ్యన్నపాత్రుడు ఉదయం 9.45 గంటలకు ప్రారంభిస్తారు.ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్, ఏపీ బ్రెవరీస్ కార్పొరేషన్ ఎండీ, డెరైక్టరేట్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు కార్యాలయాలను ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నగరానికి సమీపంలో గల ప్రసాదంపాడులో ఉదయం 10.15 గంటలకు ప్రారంభిస్తారు.


 

ఆర్‌డబ్ల్యూఎస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు గొల్లపూడి సాయిపురం కాలనీలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభిస్తారు. సెర్ఫ్ (సాధికారత) కార్యాలయాన్ని మంత్రి కిమిడి మృణాళిని గొల్లపూడి టీటీడీలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభిస్తారు.ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ చీఫ్ కార్యాలయాన్ని మంత్రి ఆయ్యన్నపాత్రుడు గొల్లపూడి వసుధ కాంప్లెక్స్‌లో ఉదయం 10.45 గంటలకు ప్రారంభిస్తారు. శాప్ కార్యాలయాన్ని చైర్మన్ మోహన్ స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని జిమ్నాస్టిక్స్ హాలులో ఉదయం 11.30 గంటలకు ప్రారంభిస్తారు.


 

టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రసాదంపాడు టయోటా షోరూం ఎదురుగా గల ఏఎన్‌ఆర్ టవర్స్‌లో ఉదయం 11.30 గంటలకు ప్రారంభిస్తారు. ఉదయం 9.30 గంటలకు విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌కు హైదరాబాద్ బస్ భవన్ నుంచి ఆర్టీసీ ఉద్యోగులు తరలివస్తున్నారు. వారికి ఆర్టీసీ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశాయి.


 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top