పెళ్లి బృందం ఆటో బోల్తా..
కుప్పం రూరల్(చిత్తూరు జిల్లా): పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటో బోల్తాపడి 11 మంది గాయపడిన ఘటన కుప్పం మండలం, మాడల్ కాలనీ వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం కంచిబందార్లపల్లికి చెందిన వరుడు వెంకటేష్, పెళ్ళికుమార్తె మురుగేషమ్మలకు సోడిగానిపల్లి గ్రామంలో వివాహం జరిగింది. రాత్రి వరుని స్వగృహం కంచిబందార్లపల్లిలో నలుగులు పెట్టె కార్యక్రమానికి 11 మంది బృందం ఆటోలో ప్రయాణమయ్యారు.
ఆటో మాడల్ కాలనీ సమీపంలోకి రావడంతో అదుపు తప్పి బోల్తాపడింది. ప్రమాదంలో పెళ్ళికొడుకు, కుమార్తెలు వెంకటేష్ (28), మురుగేషమ్మ(18)లు స్వల్పంగా గాయపడ్డారు. మిగిలిన వారిలో శాంతమ్మ (50), పార్వతి (37),సల్లాపురి (40), వెంకటేష్(43)లకు స్వల్పగాయాలయ్యాయి. రామక్క (32), పెద్దక్క (70),బాలరాజు (37), వెంకటప్ప (70), దీప్తి (3)లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు.