రోడ్డుపై విషమంగా వ్యక్తి.. పిలిచినా రాని '108'


నందికొట్కూరు: ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని సత్వరమే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే సదుద్దేశంతో తీసుకొచ్చిన పథకం '108'. ఒక్క ఫోన్‌ కాల్‌తో బాధితులను ఆదుకొని.. ప్రాణాలు నిలబెట్టాల్సిన '108' పథకం నానాటికీ నీరుగారిపోతున్నది. తాజాగా ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై.. విషమ పరిస్థితిలో ఉన్నా.. '108' సిబ్బంది సకాలంలో స్పందించలేదు. దీంతో రోడ్డుమీద విలవిలలాడుతున్న బాధితుడిని స్థానికులే ఆస్పత్రికి తరలించారు.



ఈ ఘటన కర్నూలు జిల్లా నందికొట్కూరు శివారులో సోమవారం రాత్రి జరిగింది. బైక్‌పై వెళుతున్న మధు (35) అనే వ్యక్తిని ఓ వాహనం ఢీకొనడంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు 108కు ఫోన్‌ చేశారు.  అరగంట అయినా '108' అంబులెన్స్ సంఘటనాస్థలానికి చేరుకోలేదు. దీంతో స్థానికులే అరగంట తర్వాత బాధితుడిని వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top