రాష్ట్రంలో 1206 డెంగీ కేసుల నమోదు
జి.సిగడాం: రాష్ట్రంలో ఇప్పటివరకు 1206 డెంగీ కేసులు నమోదుకాగా శ్రీకాకుళం జిల్లాలో 56 కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య శాఖ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జి.సావిత్రి తెలిపారు. మండలంలోని పెంట గ్రామాన్ని ఆమె శుక్రవారం పరిశీలించారు. తాగునీటి వనరుల వద్ద మురుగునీరు నిల్వ ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని రిమ్స్లో డెంగీ నిర్ధారణ పరీక్షల కేంద్రం ఉందని, జ్వర పీడితులందరూ ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య 40వేలుకు తగ్గితే మెరుగైన వైద్యసేవలు పొందాలన్నారు.
రాజాం జీఎంఆర్, రిమ్స్, జెమ్స్ ఆస్పత్రులలో ప్లేట్లెట్స్ ఉన్న రక్తం అందుబాటులో ఉందని చెప్పారు. డెంగీతో పాటు టైఫాయిడ్, మలేరియా జ్వరాలపై అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. జ్వర పీడితులు గ్రామాల్లోని సంచి వైద్యులను ఆశ్రయించరాదని సూచించారు. వర్షాకాలంలో తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరూ కాచిచల్లార్చిన నీటినే తాగాలన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ఆమె వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదనపు డీఎంహెచ్ఓ మెండు ప్రవీణ్కుమార్ ఉన్నారు.