బెజవాడలో వందేళ్ల జెండాచెట్టు తొలగింపు
విజయవాడ: నగరాభివృద్ధి పేరుతో విజయవాడలో వందేళ్ల చరిత్ర కలిగిన జెండాచెట్టును నగరపాలక సంస్థ అధికారులు శనివారం అర్థరాత్రి తొలగించారు. దీంతోపాటు అక్కడే ఉన్న కనకదుర్గ ఆలయాన్ని కూడా కూలగొట్టారు. మతాలకతీతంగా అందరూ పూజించే జెండాచెట్టును కూల్చడంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వించిపేట ముసాఫిర్ ఖానా వద్ద ఉన్న ఈ చెట్టు ఎంతో ప్రసిద్ధి చెందింది. దీన్ని వేళ్లతో సహా పెకిలించి వేశారు.
కాగా గతంలోనూ పుష్కరాలకు అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా ప్రార్థనాలయాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. ప్రజల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్డుపక్కగా ఉన్నవాటిని అర్ధరాత్రి సమయంలో పడగొట్టేస్తోంది. ఇప్పటికేదుర్గగుడి గోశాల వెనుక భాగంలోని శంకరమఠాన్ని పూర్తిగా కనుమరుగుచేసింది. గాయత్రిదేవి, శివాలయంతో, ఆంజనేయస్వామి గుడులతో పాటు మరికొన్ని ఆలయాలను తొలగించారు. మొదటి అంతస్తులో ఉన్న ప్రవచనా మందిరాన్ని పూర్తిగా తొలగించగా, కింద అంతస్తులో ఉన్న ఆలయాలను తొలగించేందుకు గడువు ఇచ్చారు.