ప్రొఫెసర్ కంభంపాటికి అమెరికా ప్రెసిడెన్సియల్ అవార్డు
విశాఖపట్నం: అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అమెరికా ప్రెసిడెన్సియల్ అవార్డు భారతీయ-అమెరికన్ ప్రొఫెసర్కు దక్కింది. సైన్స్, మాధ్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రతిభ కనబచిన వారికి అమెరికా ఈ అవార్డును అందిస్తుంటుంది. ఈ ఏడాది న్యూరల్సన్లోని సదరన్ యూనివర్శిటీ బయాలజీ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న మూర్తి ఎస్ కంభంపాటికి ఈ అవార్డును యూఎస్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. మూర్తి పరిశోధన రంగంలో విశేష కృషి చేశారని, ఆయన చేసిన కృషి అమెరికాలో ఇంజనీర్లు, గణిత శాస్త్రవేత్తల ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఉపకరిస్తుందని అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది చివరిలో వైట్హౌస్లో జరిగే ఓ కార్యక్రమంలో మూర్తికి అవార్డు అందజేయనున్నట్లు వైట్హౌస్ తెలిపింది.
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1979లో బీఎస్సీ, 1981లో ఎమ్మెస్సీ(బోటనీ), 1988లో ఎకాలజీ విభాగంలో పీహెచ్డీ పూర్తిచేసిన మూర్తి అమెరికాలోనూ ఉన్నత విద్యనభ్యసించారు. అక్కడి జన్సన్ యూనివర్శిటీలో 1990 నుంచి 1994 వరకూ రీసెర్చ్ అసోసియేట్గా పనిచేశారు. ఇదే యూనివర్శిలీలో 1999లో ఎన్విరాన్మెంటల్ సెన్సైస్లో పీహెచ్డీ చేశారు. 1994లో సదరన్ యూనివర్శిటీలో చేరి 2001 బయోలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. తర్వాత అసోసియేట్గా,ఆ తర్వాత ప్రొఫెసర్గా పదోన్నతి సాధించారు. ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సెన్సైస్, బయాలజీ, బయోటెక్నాలజీ అంశాలపై పలు జర్నల్స్ ప్రచురించారు.