100 కోట్ల మార్క్‌ను దాటిన టెలిఫోన్ కనెక్షన్లు

100 కోట్ల మార్క్‌ను దాటిన టెలిఫోన్ కనెక్షన్లు


న్యూఢిల్లీ: భారత్‌లో టెలిఫోన్ కనెక్షన్లు 100 కోట్ల మార్క్‌ను దాటాయి. వీటిలో మొబైల్ కనెక్షన్లు 98 కోట్లుగా ఉన్నాయి. ఈ విషయాన్ని టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ప్రభుత్వ రంగ టెక్నాలజీ సెంటర్ సీ-డాట్ రూపొందించిన లాంగ్ డిస్టెన్స్ వై-ఫై సిస్టమ్, సోలార్ పవర్ వై-ఫై సిస్టమ్, 100 జీబీపీఎస్ ఓఎఫ్‌సీ లింక్  తదితర టెలికం నెట్‌వర్క్ ఉత్పత్తుల ఆవిష్కరణలో భాగంగా ఆయన ఇక్కడ జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.



కొత్త కనెక్షన్ల సంఖ్య ప్రతి నెలా 50-70 లక్షల వరకు ఉందని పేర్కొన్నారు. దేశంలో 30 కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నాయన్నారు. వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్యను 50 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ నెల చివరకు దేశం లో 99.9 కోట్ల ఫోన్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో వైర్‌లెస్/మొబైల్ కనెక్షన్ల సంఖ్య 97.3 కోట్లు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top