'ఈ టెక్ దిగ్గజం 6000 మందిని తీసేస్తోంది..'

'ఈ టెక్ దిగ్గజం 6000 మందిని తీసేస్తోంది..'

బెంగళూరు : సాఫ్ట్ వేర్ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ జూన్ 30 వరకు 6వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్లాన్స్ వేస్తుందంటూ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కంపెనీ భారీగా చేపడుతున్న ఈ ఉద్యోగాల కోతకు అడ్డుకట్ట వేయాలంటూ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ యూనియన్(ఐటీఈయూ) సభ్యులు కర్నాటక ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గేను కోరారు. రాష్ట్రంలో ఐటీ కంపెనీలు చేపడుతున్న అక్రమ లేఆఫ్స్ పై సభ్యులు తమ ఆందోళనను వ్యక్తంచేశారు. ఈ విషయంలో వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని వీటిని నిరోధించాలని విజ్ఞప్తి చేసినట్లు ఐటీఈయూ అధ్యక్షుడు ఏసీ కుమార స్వామి శనివారం మీడియాకు తెలిపారు.

 

విప్రో కంపెనీ జూన్ 30 వరకు 6వేల తొలగించేందుకు రంగం సిద్ధం చేసుకుందని, విప్రో బాటలోనే చాలా ఐటీ కంపెనీలు ప్లాన్స్ వేస్తున్నాయని స్వామి ఆరోపించారు.  ఐటీ కంపెనీలు లేఆఫ్స్ విషయంపై అంతకముందే జూన్ 5న కూడా ఖర్గేను కలిశారు. సిబ్బంది తొలగింపు భయాందోళనలు తగ్గించడానికి మంత్రి ఐటీ కంపెనీలతో ప్రాథమిక చర్చలు ప్రారంభించారు. ఉద్యోగాల కోత విషయమే కాక,  పని సమయాల్లో కంపెనీ వ్యవహరించే తీరుపై కూడా యూనియన్ సభ్యులు మంత్రికి ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమం పట్టించుకోకుండా, కేవలం టార్గెట్లనే ఛేదించడమే లక్ష్యంగా మిడిల్ లెవల్ మేనేజర్ల ద్వారా జూనియర్ ఉద్యోగులపై పనిఒత్తిడిని పెంచుతున్నాయని ఆరోపించారు.

 

ఎక్కువ పని గంటలు, విపరీతమైన ఒత్తిడి కారణంగా చాలా మంది  ఉద్యోగులు రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఐటీఈయూ సెక్రటరీ ఎం.చంద్రమౌళి చెప్పారు. రాష్ట్రంలోని ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న 10 లక్షల మంది ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర కార్మిక మంత్రి, లేబర్ కమిషనర్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. ఏ ఉద్యోగినైనా కంపెనీ నుంచి తొలగించేటప్పుడు రెండు నెలల ముందు వారికి నోటీసు ఇవ్వాలన్నారు.. అంతేకాక వచ్చే 12 నెలల కోసం ఏడాది పాటు వేతనం, మెడికల్ ఇన్సూరెన్స్ తో కూడిన సెవరెన్స్ ప్యాకేజీ ఇవ్వాలని ఐటీఈయూ డిమాండ్ చేస్తోంది.  
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top