మిస్త్రీకి పూర్తిగా 'టాటా'

టాటా గ్రూప్‌ నిర్ణయం: మిస్త్రీతో పూర్తిగా కటీఫ్‌

న్యూఢిల్లీ : కొత్త చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ నేతృత్వంలో టాటా గ్రూప్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. టాటా సన్స్‌లో అతిపెద్ద వాటాదారు అయిన షాపూర్జి పల్లోంజి గ్రూప్‌తో ఉన్న అన్ని వ్యాపార సంబంధాలతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని టాటా గ్రూప్‌ నిర్ణయించింది. ఈ గ్రూప్‌ను టాటా సన్స్‌ చైర్మన్‌గా ఉద్వాసనకు గురైన సైరస్‌ మిస్త్రీ కుటుంబం ప్రమోట్‌ చేస్తోంది. దీంతో సైరస్‌ మిస్త్రీ కుటుంబానికి చెందిన అన్ని సంస్థలతో ఉన్న డీలింగ్స్‌కు చెక్‌ పెట్టాలని నిర్ణయిస్తోంది. టాటా సన్స్‌ బోర్డు, టాటా గ్రూప్‌లోని మేజర్‌ ఆపరేటింగ్‌ సంస్థల ప్రమోటర్‌ గత నెలలో సమావేశమయ్యాయని, ఈ మీటింగ్‌లో షాపూర్జి పల్లోంజి గ్రూప్‌తో ఉన్న అన్ని వ్యాపార సంబంధాలను తెంచుకోవాలని సంస్థలను ఆదేశించినట్టు టాటా గ్రూప్‌ ఇన్‌సైడర్స్‌ తెలిపారు.

 

టాటా సన్స్‌ చైర్మన్‌గా ఉన్న సైరస్‌ మిస్త్రీకి, గతేడాది బోర్డు సభ్యులు అర్థాంతరంగా ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. ఈ హఠాత్తు పరిణామం అనంతరం నుంచి టాటా సన్స్‌కు, మిస్త్రీకి వాదనలు నడుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే టాటా గ్రూప్‌ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 18.4 శాతం వాటాతో టాటా సన్స్‌లో షాపూర్జి పల్లోంజి గ్రూప్‌ అతిపెద్ద సింగిల్‌ వాటాదారునిగా ఉంది. అయితే మిస్త్రీ టాటా సన్స్‌కు చైర్మన్‌గా ఉన్నప్పుడు తమకెళ్లాంటి కొత్త ఇంజనీరింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ కాంట్రాక్టులు దక్కలేదని ఎస్‌పీ గ్రూప్‌ చెబుతోంది. 2012-13లో రూ.1,125 కోట్లగా ఉన్న టాటా గ్రూప్‌నుంచి తమకి వచ్చిన ఆర్డర్లు, 2015-16 నాటికి జీరోకి పడిపోయాయని పేర్కొంది. మిస్త్రీకి, టాటా గ్రూప్‌కు నెలకొన్న యుద్ధం, ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది.  
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top