నిర్వహణ సేవలకోసం ‘ట్యాప్ మీ’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్వహణ సేవలు అందిస్తున్న గుర్గావ్ కంపెనీ ‘ట్యాప్ మీ’ హైదరాబాద్లో అడుగుపెడుతోంది. ఇప్పటికే కంపెనీ వైజాగ్, పట్నా, జైపూర్లో కార్యకలాపాలు సాగిస్తోంది. హైదరాబాద్లో తొలుత ఆఫీస్ నిర్వహణ సర్వీసులు అందిస్తామని ట్యాప్ మీ సహ వ్యవస్థాపకులు స్నేహాన్షు గాంధీ తెలిపారు. కొద్ది రోజుల్లో సామాన్యులకూ సేవలను విస్తరిస్తామని అన్నారు. సిటీ ఆపరేషన్స్ హెడ్ జి.అశోక్ కుమార్తో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు.
ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్, ప్లంబర్, పెయింటర్ కావాల్సిన వారు కంపెనీని సంప్రదిస్తేచాలని చెప్పారు. ప్రస్తుతం సంస్థ 300 పట్టణాల్లో సేవలు అందిస్తోంది. హైదరాబాద్ కోసం 500 మంది సర్వీస్ ప్రొవైడర్లను నియమిస్తామన్నారు. డిసెంబరుకల్లా సిబ్బంది సంఖ్య 1,000 దాటుతుందని, ఐటీఐ పూర్తిచేసిన ఫ్రెషర్లను సైతం తీసుకుంటామని పేర్కొన్నారు. విజిటింగ్ చార్జీలు తీసుకోమని, రిపేర్ పూర్తి అయితేనే చార్జీ వసూలు చేస్తామన్నారు. పారదర్శకత కోసం చార్జీల వివరాలు ఎస్ఎంఎస్, ఈ–మెయిల్ ద్వారా కస్టమర్లకు చేరవేస్తామని తెలిపారు.